బీజేపీ గుండెల్లో సంజయ్ రౌత్ బాంబు: గోవాపై కన్నేసిన శివసేన: గోవా ఫార్వర్డ్ పార్టీతో మంతనాలు..!
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని దూరం చేసిన శివసేన.. సరి కొత్త వ్యూహాలను పన్నుతోంది. పొరుగునే ఉన్న గోవాపై కన్నేసింది. గోవాలో అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులను కదుపుతోంది. ఇందులో భాగంగా- గోవా ఫార్వర్డ్ పార్టీతో మంతనాలు సాగిస్తోంది శివసేన. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై ఆరా తీస్తోంది.

సంజయ్ రౌత్ కు బాధ్యతలు అప్పగింత..
మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో మహా వికాస్ అఘాడీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆవిర్భవించడానికి ప్రధాన కారకుడు.. సంజయ్ రౌత్. ఆయన పట్టిన పట్టు వల్లే మహారాష్ట్రలో శివసేన.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి దారి తీసింది. మహారాష్ట్ర టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేసిన సంజయ్ రౌత్ కే గోవా బాధ్యతలను అప్పగించింది.

ముంబైలో గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యేలు..
తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి రంగంలో దిగారు సంజయ్ రౌత్. ఈ తెల్లవారు జామున ఆయన గోవా ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ తో మాట్లాడారు. ఆ వెంటనే విజయ్ సర్దేశాయ్ సహా ఆ పార్టీకి చెందిన ముగ్గురు శాసన సభ్యులు ముంబైలో ప్రత్యక్షం అయ్యారు. సంజయ్ రౌత్ తో సమావేశం అయ్యారు. సంజయ్ రౌత్ ఆహ్వానం మేరకు తాము ముంబైకి వచ్చామని, గోవా రాజకీయ పరిణామాలపై చర్చించామని విజయ్ సర్దేశాయ్ తెలిపారు.

గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ..
ప్రస్తుతం గోవాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 21 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. 13 స్థానాలను మాత్రమే దక్కించుకున్నప్పటికీ.. బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

బీజేపీకి మిత్రపక్షంగా గోవా ఫార్వర్డ్ పార్టీ..
ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది. స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన ఒకరితో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 17 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ, తన మిత్ర పక్షం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ రెండు పార్టీలకు కలిపి 18 స్తానాలు ఉన్నాయి. గోవా ఫార్వర్డ్ పార్టీ గనక బీజేపీకి తన మద్దతును ఉపసంహరించి కాంగ్రెస్-ఎన్సీపీలతో చేరిత.. బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం. దాని స్థానంలో కాంగ్రెస్-ఎన్సీపీ-గోవా ఫార్వర్డ్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు.

సంజయ్ రౌత్ తో ముగ్గురు ఎమ్మెల్యేల భేటీ..
ఈ లెక్కలన్నింటినీ బేరీజు వేసుకున్న శివసేన.. సంజయ్ రౌత్ ను బరిలో దింపింది. గోవా ఫార్వర్డ్ పార్టీ సభ్యులు విజయ్ సర్దేశాయ్, వినోదా పలియంకర్, జయేష్ సల్గావ్ కర్.. ముంబైలో సంజయ్ రౌత్ ను కలిశారు. ఈ పరిణామాలు బీజేపీలో గుబులు రేపుతున్నాయి. సంజయ్ రౌత్ ఆహ్వానం మేరకే తాము ముంబైకి వచ్చినట్లు విజయ్ సర్దేశాయ్ వెల్లడించారు. గోవా రాజకీయ పరిణామాలపై చర్చించామని మాత్రమే చెబుతున్నారు గానీ.. ఆ చర్చల సారాంశాన్ని బయట పెట్టట్లేదాయన.












Click it and Unblock the Notifications