టీచర్లు కొట్టారని.. ఉరివేసుకుని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మరో నెలరోజుల్లో పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తరగతి ఉపాధ్యాయులు తనను తీవ్రంగా కొట్టడంతో మానసికంగా ఆందోళనకు గురైన ఆ విద్యార్థి తనువు చాలించాడు.
బనస్కాంత జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు ఉపాధ్యాయులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల ప్రకాశ్ చౌహాన్ స్థానిక గాయత్రి విద్యాలయంలో పదోతరగతి చదువుతున్నాడు.
పాఠశాలకు సంబంధించిన కెమెరాను పాడుచేశాడని ఆరోపిస్తూ నలుగురు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థి ప్రకాశ్ను గదిలో బంధించి, విపరీతంగా కొట్టారు. గాయాలతో ఇంటికి వెళ్లిన ప్రకాశ్ జరిగిన విషయాన్ని తండ్రితో చెప్పి విపరీతంగా ఏడ్చాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే సూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు స్కూల్పై దాడి చేశారు. ప్రకాశ్ తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులైన నలుగురు టీచర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.