ఎయిర్ పోర్ట్లో పురుష ఎంపీ చెంప పగులగొట్టిన మహిళా ఎంపీ
చెన్నై: అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప శనివారం నాడు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివపై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
డీఎంకే ఎంపీ చెంప పగులగొట్టిన సదరు మహిళా అన్నాడీఎంకే ఎంపీ దానిని సమర్థించుకుంటున్నారు. శశికళ పుష్ప (అన్నాడీఎంకే), తిరుచ్చి శివ(డీఎంకే) మధ్య సాన్నిహిత్యం ఉందని చెబుతూ, అందుకు సంబంధించిన ఫోటోలు వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చాయి.
ఈ చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు ఎంపీలు ఢిల్లీ విమానాశ్రయంలో ముష్టియుద్ధానికి దిగడం గమనార్హం.
విమానంలో చెన్నై వచ్చేందుకు ఎంపీలు తిరుచ్చి శివ, శశికళ పుష్పలు శనివారం మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ కొట్టే వరకు వెళ్లింది. దీంతో అక్కడున్న వారు నివ్వెరపోయారు. వారిని భద్రతా సిబ్బంది విడదీశారు.
దీనిపై శశికళ పుష్ప మాట్లాడుతూ.. తాను శివ చెంప పగలుగొట్టానని చెప్పారు. తమ సీఎం జయలలితతో పాటు తమ ప్రభుత్వంపై విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఆయన అవహేళనగా మాట్లాడారని చెప్పారు. దీంతో తాను స్వరం పెంచానని, ఆ తర్వాత కొట్టానని చెప్పారు.