పైలెట్ తో పెట్టుకోకు: పరిస్థితి వేరుగా ఉంటుంది
న్యూఢిల్లీ: పైలెట్ తో పెట్టుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని మరో సారి రుజువు అయ్యింది. కాక్ పీట్ లో ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్ శుభ్రంగా లేదని మొండి పట్టుపట్టిన పైలెట్ మూడు గంటల పాటు విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులతో ఆడుకున్నాడు.
బుధవారం వేకువ జామున 5.35 గంటల సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు న్యూ ఢిల్లీ నుండి కొచ్చికి వెళ్లవలసి ఉంది. అదే సమయంలో పైలెట్ (క్యాప్టెన్) నేరుగా కాక్ పీట్ లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్ శుభ్రంగా లేదని మండిపడ్డాడు.
వెంటనే సిబ్బంది కోలిన్ తో మాస్క్ ను శుభ్రం చేసి ఇచ్చారు. అయితే పైలెట్ మాత్రం అతని మొండితనం వీడలేదు. కొత్త మాస్క్ తీసుకు వచ్చి ఇస్తేనే తాను విమానం నడుపుతానని లేదంటే లేదని తేల్చి చెప్పాడు. అంతే ప్రయాణికులు హడలిపోయారు.
తరువాత ఆయన గారికి కొత్త మాస్క్ తీసుకు వచ్చి ఇచ్చారు. ఈ తతంగం జరగడంతో మూడు గంటల పాటు ప్రయాణికులు వేచి ఉన్నారు. ఈ దెబ్బతో ఈ ప్రభావం మిగిలిన విమానం సర్వీసుల మీద పడింది. విమానాలు ఆలస్యంగా నడిచాయి.
ఈ విషయంపై ఎయిర్ ఇండియా చైర్మన్ రోహిత్ నందన్ స్పందించారు. చిన్న చిన్న విషయాలకు పేచీలు పెట్టి విమానాలు ఆలస్యంగా నడిపితే పరిస్థితి వేరుంగా ఉంటుందని హెచ్చరించారు. బుధవారం న్యూ ఢిల్లీలో జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.