రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్ధం, తెలంగాణలో టీడీపీ, బీజేపీ దూరం
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటుతో దామాషా ప్రకారం పరోక్ష పద్ధతిలో ఓటు వేయనున్నారు.
అనంతరం గంట సేపటికే ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్లో ఖాళీ అవబోతున్న 58 రాజ్యసభ స్థానాలకు 16 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి మూడేసి రాజ్యసభ సీట్లకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉండాలని ఇప్పటికే టీడీపీ, బీజేపీ నిర్ణయించుకున్నాయి. ఈ ఎన్నికల్లో 'నోటా'కు కూడా అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల బరిలో తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్కు మద్దతుగా ఎంఐఎం పార్టీ ఓటు వేయనుంది.
245 స్థానాలున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి 58 మంది, కాంగ్రెస్కు 54 మంది సభ్యులు ఉన్నారు. తన ప్రాతినిథ్యాన్ని పెంచుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఓటింగ్ ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతుంది.
ఉత్తర ప్రదేశ్ (10), మహారాష్ట్ర (6), బిహార్ (6), పశ్చిమ బెంగాల్ (5), మధ్యప్రదేశ్ (5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తెలంగాణ (3), రాజస్థాన్ (3), ఒడిశా(3), జార్ఖండ్ (2), ఛత్తీస్గఢ్ (1), హర్యానా (1), హిమాచల్ ప్రదేశ్ (1), ఉత్తరాఖండ్ (1) రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. వీటిలో 10 రాష్ట్రాల్లో 33 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.