'బ్లాక్' ఎఫెక్ట్: '05కు ముందు, 500, వెయ్యినోట్లు వెనక్కి

‘2014 మార్చి 31 తర్వాత 2005కు ముందు జారీ చేసిన అన్ని కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ నోట్లను మార్చుకోవడానికి ప్రజలు బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది' అని ఆర్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.
2005కు ముందు జారీ చేసిన కరెన్సీ నోట్లను ప్రజలు సులభంగా గుర్తించవచ్చు. ఎందుకంటే ఆ నోట్ల వెనుక వైపున నోట్లను ముద్రించిన సంవత్సరం ఉండదు. 2005 తర్వాత జారీ చేసిన నోట్లపై వాటిని ముద్రించిన సంవత్సరం నోట్ల దిగువ భాగం మధ్యలో సన్న అక్షరాలతో ముద్రించి ఉండడం చూడవచ్చు.
నోట్ల ఉపసంహరణపై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని, ఉపసంహరణ ప్రక్రియకు సహకరించాలని ఆర్బిఐ కోరుతూ, పాతనోట్లు కూడా చట్టబద్ధమైనవేనని, ఏప్రిల్ 1 తర్వాత ఏ బ్యాంకులోనైనా వాటిని మార్చుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 1 తర్వాత ప్రజలు ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా బ్యాంకులు ఈ నోట్ల మార్పిడి సదుపాయాన్ని కల్పిస్తాయని కూడా ఆర్బిఐ ఆ ప్రకటనలో తెలిపింది.
2014 జూలై 1 నుంచి పదికి పైబడిన 500, వెయ్యి రూపాయల నోట్లు మార్చుకునే వ్యక్తులు తమ ఐడెంటిటీ, నివాస ధ్రువపత్రాలను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. 2005కు ముందున్న నోట్లను ఉపసంహరించుకోవడానికి ఆర్బిఐ ఎలాంటి కారణాలు తెలపకపోయినప్పటికీ నగదు రూపంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీయడం కోసమే ఈ చర్య తీసుకున్నట్లు భావించవచ్చు.












Click it and Unblock the Notifications