ఏకమవుతున్న విపక్షాలు, వ్యూహం మార్చిన అమిత్ షా: శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేతో రేపు భేటీ
ముంబై: మహారాష్ట్రలో శివసేనతో తెగదెంపులకు బీజేపీ సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీతో వచ్చిన గ్యాప్ను పూడ్చేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం శివసేన అధినేత ఉద్దవ్ థాకరేతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
ఉద్దవ్ థాకరేను ఆయన నివాసం మాతోశ్రీలో కలవనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే సంకీర్ణం ఇటీవలి కాలంలో కాస్త బలహీనపడడం, అదే సమయంలో ప్రతిపక్షాల్లో ఐక్యత వంటి పరిణామాల నేపథ్యంలో అమిత్ షా వ్యూహం మార్చినట్టున్నారు. మిత్రులను చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
బీజేపీతో కంటే కాంగ్రెస్తో జత కట్టడమే నయమన్న అభిప్రాయం ఇటీవలే శివసేన నుంచి వ్యక్తమైంది. 2019 ఎన్నికల్లో మరోసారి బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకు వచ్చే కార్యక్రమంలో భాగంగానే అమిత్ షా ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు.
2014లో బీజేపీ, శివసేన కలసి పోటీ చేశాయి. బీజేపీ 23, శివసేన 18 లోకసభ స్థానాలను గెలుచుకున్నాయి. యూపీ తర్వాత 48 లోకసభ స్థానాలతో మహారాష్ట్ర దేశంలో రెండో అతి పెద్ద రాష్ట్రంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య పొత్తుకు సిద్ధమయ్యాయి.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్రం కూడా కీలకం. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అయితే 2014 ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ, శివసేన సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఉద్దవ్ థాకరే తరచూ బీజేపీని, మోడీని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్, అమిత్ షా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.