టెక్కీ నిరాశ: మంచి ఉద్యోగం రాలేదని పై లోకాలకు...
బెంగళూరు: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని జీవితంపై విరక్తి పెంచుకున్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. మంచి ఉద్యోగం చేస్తు అందరిని ఆదుకుంటాడని బావించిన అతని తల్లిదండ్రులకు విషాదం మిగిల్చాడు.
బెంగళూరు నగరంలోని కెంపేగౌడ నగర సమీపంలోని లక్ష్మిపురలో మహేష్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఎంటెక్ పూర్తి చేశాడు. గత సంవత్సరం బెంగళూరులోని పిణ్యాలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు.
అంతకంటే మంచి ఉద్యోగం సంపాదించాలని అక్కడ రాజీనామా చేసి పలు కంపెనీలలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నించాడు. అయితే అతని ఆశ ఫలించలేదు. కొన్ని నెలల నుండి దిగులుగా ఉన్నాడు. కుటుంబ సభ్యులు అతనికి చాలసార్లు నచ్చచెప్పి ఉద్యోగం వస్తుందిలే అని ధైర్యం చెప్పారు.
ఆదివారం మహేష్ తల్లిదండ్రులు ఊరికి వెళ్లారు. అతని అన్న, వదిన బంధవుల ఇంటికి వెళ్లారు. రాత్రి 11 గంటలకు ఇంటిలో ఒంటరిగా ఉన్న మహేష్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.