ఏపీ కేడర్ IPSకు కేంద్రం కీలక పదవి.. ఏరికోరి
దేశ అంతర్గత భద్రత, నిఘా వ్యవస్థలో ఓ కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుత ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ డేకా పదవీ కాలం జూన్ 30తో ముగియనుండటంతో, ఆయన స్థానంలో మహేష్ దీక్షిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నియామకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ నియామకాల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
1993 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే స్పెషల్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా క్వాలిఫైడ్ డాక్టర్ ఆయన. 1993లో సివిల్స్ లో ర్యాంకర్ కూడా. ఐపీఎస్ ను ఎంచుకున్నారు. పోలీస్ శాఖలో వివిధ శాఖల్లో పని చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంలో ఆయన నిఘా విభాగంలోనే అత్యధిక కాలం గడిపారు. ఈశాన్య రాష్ట్రాలు, లడఖ్ సరిహద్దుల్లో వ్యూహాత్మక ఆపరేషన్లు, మావోయిస్టులను కట్టడికి యాంటీ నక్సల్స్ విభాగాల్లో అత్యంత చురుకుగా పనిచేశారు.

క్షేత్రస్థాయిలో బలమైన సమాచార నెట్వర్క్ను నిర్మించడంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. మహేష్ దీక్షిత్ శ్రీనగర్లోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) విభాగంలో పనిచేసిన సమయంలో జమ్మూ కశ్మీర్లో కీలక పరిణామాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు చేసిన తరుణంలో అక్కడి శాంతిభద్రతలను కాపాడడంలో చాకచక్యంగా వ్యవహరించారు. కాశ్మీర్ లో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నించిన శక్తులను ఎప్పటికప్పుడు నియంత్రించారు.
ప్రస్తుత ఐబీ చీఫ్ తపన్ కుమార్ డేకా 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2022 జూన్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా నియమితులయ్యారు. 2024, 2025 లలో రెండు విడతలుగా ఆయన సర్వీసు కాలాన్ని కేంద్రం పొడిగించింది. 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లకు ఆయనే నేతృత్వం వహించారు. ఉగ్రవాదుల కదలికలను ముందే పసిగట్టి అడ్డుకోవడంలో డేకా అపార ప్రతిభ కనబరిచారు.












Click it and Unblock the Notifications