ఫోన్ మాట్లాడుతూ జారిపడి విద్యార్థిని మృతి
చెన్నై: సెల్ఫోన్ మాట్లాడుతూ హాస్టల్ భవనం రెండో అంతస్థు పైనుంచి జారిపడి ఓ విద్యార్థిని దుర్మరణం పాలైంది. తమిళనాడులోని అన్నావర్శిటీలో బీఈ రెండో సంవత్సరం చదువుతున్న షణ్ముగ ప్రీతా (19) అనే విద్యార్థిని వర్శిటీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది.
ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమె హాస్టల్ భవనంపైకి వెళ్ళి ఎత్తు తక్కువగా ఉన్న గోడపై కూర్చొని సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జారి కిందపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన జనరల్ ఆస్పత్రికి తరలించారు.
ప్రీతాను పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. ఆమె రక్తం మడుగులో పడి ఉండడాన్ని సెక్యూరిటీ గార్డులు చూశారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆమె తంర్డి ముత్తయ్య తిరువరూర్ సమీపంలోని తిరుత్తరాయ్పూడిలో మెడికల్ స్టోర్ నడుపుతాడు.
అయితే, షణ్ముగ ప్రీతా ప్రమాదవశాత్తు జారి కిండ పడిందా? లేక ఎవరైనా కిందికి తోసేశారా? అనే అంశంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. కోట్టూరుపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.