ఆ కోరిక తీరకుండానే.. మృత్యువు ఒడిలోకి మరో జవాన్
న్యూఢిల్లీ : యూరీ ఉగ్రవాద ఘటన ఆ జవాను కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దసరా నాటికి తన భార్య పొత్తిళ్లలో ఉండే తన బిడ్డను ఎత్తుకుని మురిసిపోవాలనుకున్న ఆ జవాను.. యూరీ ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి ఆదివారం నాడు తుది శ్వాస విడిచాడు. దీంతో ప్రాణాలతో తిరిగొస్తాడనుకున్నా తమ కొడుకు.. శవమై ఇంటికి రావడంతో.. అతని తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
యూరీ ఉగ్ర ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బీఎస్ఎఫ్ జవాను పిటాబస్ మాఝీ(30) గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు తుది శ్వాస విడిచాడు. వైద్యులు తమకు సాధ్యమైనంత మేర మాఝీ ప్రాణాలను నిలబెట్టేందుకు ప్రయత్నించినా.. పరిస్థితి విషమించడంతో మాఝీ కన్నుమూశాడు.
మాఝీ భార్య నిండు గర్బిణీ :
మాఝీ భార్య ప్రస్తుతం నిండు గర్భిణీగా ఉంది. వచ్చే దసరా నాటికి ఆమె ప్రసవించే అవకాశముండడంతో... తన కన్నబిడ్డను చూసుకుని మురిసిపోవాలనుకున్నాడు మాఝీ. ఇందుకోసం ముందస్తుగానే సెలవు కూడా పెట్టుకున్నాడు మాఝీ. ఇంతలోను యూరీ ఘటనలో తీవ్రంగా గాయపడడంతో.. అతను మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఇప్పుడా అమర జవాన్ కుటుంబం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. మాఝీ మృతితో యూరీ ఉగ్ర ఘటనకు బలైపోయిన అమర జవాన్ల సంఖ్య 19కి చేరుకుంది.