జవాను: ఐదుగురు సహోద్యోగులను చంపి ఆత్మహత్య
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గండేర్బాల్ జిల్లాలో ఓ సైనిక జవాను ఐదుగురు సహోద్యోగులను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని కాల్చి చంపి తాను కాల్చుకున్నాడు.
ఆ సంఘటన మనస్బాల్లోని 13 రాష్ట్రీయ రైఫిల్ శిబిరంలో చోటు చేసుకుంది. బుధవారంనాడు రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై నిమిత్తం ఆర్మీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. తన సహోద్యోగులతో అతను వాగ్వివాదానికి దిగినట్లు చెబుతున్నారు. వివాదం ముదరడంతో అతను ఈ చర్యకు దిగినట్లు అనుమానిస్తున్నారు.
ఆర్మీ జవాను విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు అంటున్నారు. కాల్పుల అనంతరం తనను తాను కాల్చుకుని చంపుకున్నాడని చెప్పారు.
గత 24 ఏళ్ల నుంచి ఇటువంటి సంఘటనలు జమ్మూ కాశ్మీర్లో జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తుండడం వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు.