రెక్కలు తెగ్గొట్టి ఎగరమంటున్నారు, పొలిటికల్ గ్యాప్ కాదు: బడ్జెట్పై బాబు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్పై బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెక్కలు తెగగొట్టి ఎగరమంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపితో రాజకీయమైన అంతరం లేదని, ఉన్నవి ఆర్థిక, విధాన నిర్ణయాల అంతరం మాత్రమేనని ఆయన అన్నారు. వరల్డ్ క్లాస్ రాజధానిని నిర్మిస్తామని ప్రధాని మోడీ అన్నారని, దాన్ని అమలు చేయాలని అడుగుతున్నామని, అది రాజకీయ నిర్ణయమని, విభజన రాజకీయ నిర్ణయమని, అందువల్ల న్యాయం చేయడానికి కూడా రాజకీయ నిర్ణయమే కావాలని చంద్రబాబు అన్నారు.
కేంద్ర బడ్జెట్పై చంద్రబాబు శనివారం సాయంత్రం విస్తృతంగా మాట్లాడారు. విభజనలో తనను ఎక్కడా భాగస్వామిని చేయలేదని, ఏం చెప్పకుండా చేస్తున్నారని తాను చెప్పానని, చాలా సమస్యలు వస్తాయని చెప్పానని ఆయన అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శ్వేతపత్రాలు విడుదలచేశానని ఆయన చెప్పారు. కేంద్రం తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు ఢిల్లీ వెళ్లివచ్చానని, అయినా ఫలితం దక్కలేదని ఆయన అన్నారు. ఎపికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమ మీద, కేంద్రం మీద ఉందని ఆయన అన్నారు. కేంద్రాన్ని ఒప్పిస్తే తప్ప న్యాయం జరగదని, ఒప్పిస్తామనే నమ్మకం ఉందని, అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని, ఇలా అయితే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లి తమకు జరిగిన అన్యాయంపై పెద్దలను కలుస్తానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికావసరాలను కేంద్ర బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. విశాఖ రైల్వే జోన్పై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. ఎంసెట్, జలాల పంపకాలపై తానే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెసు చేసిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్ఱధాని మోడీపై ఉందని చంద్రబాబు అన్నారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేలా కేంద్రం సాయం చేయాల్సిందేనని ఆయన అన్నారు. చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ వంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే వరకు సాయం చేయాలని ఆయన అన్నారు. ప్రధాని మోడీని, ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి సమస్యలను వివరిస్తానని ఆయన అన్నారు. బడ్జెట్లో ఎపికి పూర్తిగా న్యాయం చేయలేకపోయారని ఆయన అన్నారు. అందరితో సమానంగా ఎపి పైకి వచ్చేంత వరకు చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు
కేంద్ర బడ్జెట్ను తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. ఆర్థిక సంఘం పూర్తిగా నిరాశ కలిగించిందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు బౌగోళికంగా కలవకున్నా విద్వేషాలు లేకుండా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సానుకూల దృక్పథంతో ఆలోచించి కసిని సానుకూల శక్తిగా మార్చుకోవాలని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదాపై మొండిచేయి
ఎపికి ప్రత్యేక హోదాపై కేంద్రం మొండి చేయి చూపిందని ఆయన అన్నారు. బడ్జెట్లో నూతన రాజధాని ప్రస్తావనే లేదని, నూతన రాజధానికి నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు. తీవ్ర నిరాశలో ఉన్నామని ఆయన అన్నారు. ఎపిని ఫైనాన్స్ కమిషన్ పట్టించుకోలేదు, కేంద్ర బడ్జెట్ కూడా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ఎపికి న్యాయం జరగలేదని అన్నారు.
తెలంగాణ, ఎపి ఆదాయాల్లో 11 శాతం అంతరం ఉందని, దీనికి ఎపి ప్రజలు బాధ్యులా అని చంద్రబాబు అన్నారు. ఎపిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. విధాన నిర్ణయాల్లో, ఆర్థిక సాయంలో ఎపికి చేయూత అందించాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెసు చేసిన అన్యాయాన్ని సరి చేసే బాధ్యత ప్రధాని మోడీపై ఉందని తాను ఆశించానని, అది చేస్తారని ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. గన్నవరం విమానాశ్రయానికి నిదుల ప్రస్తావన లేదని గుర్తు చేశారు.
రాత్రింబవళ్లు పనిచేస్తున్నా..
ఈ రోజు సమస్య వచ్చిందని, రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడిందని, తాను రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, పెట్టుబడుల కోసం ప్రపంచమంతా తిరుగుతున్నానని, నిధులు లేకున్నా ఏ విధంగా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన చేస్తున్నానని ఆయన అన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద తుఫాను వచ్చిందని, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, హుధుద్ తుఫాన్ వల్ల 61 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు తెగిన రెక్కలతో ఎలా ఎగరగలం, రెక్కలు తెగ్గొట్టి ఎగరమంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సరైన నిధులు లేవని ఆయన అన్నారు.
పరిపాలన ఆంధ్రప్రదేశ్ నుంచి చేయాలంటే సరైన వసతులు లేవని ఆయన అన్నారు. ఉద్యోగులను తీసుకుని వెళ్లడానికి వారికి క్వార్టర్లు లేవని, పైగా పిల్లల చదువులు, సొంత ఇళ్లు, మొదలైనవి హైదరాబాదుతో ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. ఇంతగా ఒత్తిడికి గురువుతుంటే కేంద్రం సాయం చేయడానికి ముందుకు రాలేదనే బాధ ఉందని ఆయన అన్నారు. కేంద్రాన్ని ఒప్పించి, ముందుకు రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని చంద్రబాబు అన్నారు.
పెద్ద కంపెనీతో చిన్న కంపెనీ, పెద్ద దేశంతో చిన్న దేశం పోటీ పడడం కష్టమని, తమ పరిస్థితి అలాగే ఉందని ఆయన అన్నారు. సమస్యను అధిగమించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలని, చేస్తామని చంద్రబాబు చెప్పారు. విభజన సమయంలో కాంగ్రెసు చర్చ పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, విషయాలు దాచిపెట్టి విభజన చేస్తే సమస్యలు వస్తాయని ముందే చెప్పానని, అ సమస్యలే వచ్చాయని ఆయన అన్నారు.
ఆ మూడు నగరాల స్థాయి రాజధాని కావాలి
రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదని, విభజనకు ముందు చర్చ పెట్టి సమన్యాయం చేయాలని తాను అడిగానని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూర్ వంటి రాజధాని ఎపికి ఏర్పడే వరకు కేంద్రం సాయం చేయాలని ఆయన అన్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా, ఆ రాష్ట్రాల స్థాయి వచ్చే వరకు ఎపిని ఆదుకోవాలని ఆయన అన్నారు. మిత్రపక్షమైనా సాయం చేయాలి కదా, మిత్రపక్షం కాబట్టి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంనది ఆయన అన్నారు. తన స్వార్థం కోసం అడగడం లేదని అన్నారు.
తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు మిగులులో ఉన్నాయి, ఎపి ప్రజలు ఏం తప్పు చేశారని ఆయన అన్నారు. పెట్టుబడులన్నీ హైదరాబాదులో పెట్టామని, అలా పెట్టుబడులు వచ్చేలా చేసింది తానే అని, అలా చేసిన తర్వాత విభజన వచ్చిందని, విభజన జరిగిన తర్వాత తెలంగాణలో సంపద ఉండడం మంచిదే గానీ ఇంకో ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు. అలా చేయకపోవడం వల్లనే కోపం వస్తోందని చంద్రబాబు అన్నారు. తాము రాష్ట్రంలో అధికారంలో, బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నామని, ఎపికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత తమ ఇద్దరిపై ఉంటుందని చంద్రబాబు అన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications