షాక్: ముఖ్యమంత్రినే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు!
అధికార ప్రాంతీయ పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(పీపీపీ).. తమ ముఖ్యమంత్రి పెమాఖండూ, డిప్యూటీ సీఎంతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీనుంచి సస్పెండ్ చేసింది.
ఈటానగర్: అరుణాచల్ప్రదేశ్ రాజకీయాలు మరోసారి వార్తల్లోకెక్కాయి. ఏకంగా అధికార ప్రాంతీయ పార్టీ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(పీపీపీ).. తమ ముఖ్యమంత్రి పెమాఖండూ, డిప్యూటీ సీఎంతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీనుంచి సస్పెండ్ చేసింది.
క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారంటూ వారిపై వేటు వేసినట్లు తెలిపింది. అంతేగాక, ఖండూ ఇక ఎంతమాత్రమూ శాసనసభాపక్ష నేత కాదని, అతనికి ఇక ఏ అధికారాలూ ఉండబోవని పార్టీ అధ్యక్షుడు కహఫా బెంజియా ప్రకటించారు.
పార్టీ సభ్యులెవరూ ఆయన నిర్వహించే సమావేశాలకు హాజరుకావొద్దని నేతలను హెచ్చరించారు. దీన్ని ఉల్లఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సైతం వెనకాడబోమన్నారు. త్వరలో కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటామని స్పష్టం చేశారు.
ఖండూ స్థానంలో మరో నేత తకమ్ పరియోను ఎన్నుకోనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. సభాపతి, గవర్నర్లకు ఈ విషయంపై పార్టీ సమాచారం అందించినట్లు తెలిసింది. కాగా, సెప్టెంబర్లో పెమా ఖండూతో పాటు మరో 42 మంది కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు.. పీపీఏలో చేరి అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.