మజ్లిస్పై ఉద్ధవ్థాకరే నిప్పులు, నీ పనిచూసుకో!: అసద్
ముంబై/హైదరాబాద్: మజ్లిస్ పార్టీ పైన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. దీనికి మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ కూడా హైదరాబాదులో విలేకరుల సమావేశంలో స్పందించారు. ఉద్దవ్ మాట్లాడుతూ.. ముస్లీంల మనసుల్లో మజ్లిస్ విషబీజాలు నాటిందని, ముఖ్యంగా ఒవైసీ సోదరులు ఛాందసవాద ఆలోచనలను విస్తరింపచేస్తున్నారన్నారని ఆరోపించారు.
అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలు దేశవ్యాప్తంగా ముస్లింల ఆలోచనలను చెడగొడుతున్నారన్నారు. హిందూమతానికి, హిందువులకు ఎంతో ప్రమాదకరమైన శక్తులు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాయన్న ఒవైసీ సోదరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని థాకరే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాందేడ్ మునిసిపల్ కార్పొరేషన్లో విజయం సాధించిన ఆ ఛాందసవాదులు మరాట్వాడ రీజియన్లోకి విస్తరించాలని చూస్తున్నారని సామ్నా పత్రికకు రాసిన సంపాదకీయంలో ఆయన పేర్కొన్నారు. కాగా, మజ్లిస్ పార్టీ ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచింది. మరో పద్నాలుగు నియోజకవర్గాల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచింది.
అయితే, ఉద్ధవ్ వ్యాఖ్యల పైన హైదరాబాదులో అసదుద్దీన్ తీవ్రంగా స్పందించారు. తాను భారతీయుడినని, భారత రాజ్యాంగాన్ని నమ్ముతానని చెప్పారు. తనను జాతి వ్యతిరేకి అనే హక్కు ఎవరికీ లేదన్నారు.
ఉద్ధవ్ థాకరే ముందుగా బీజేపీతో వ్యవహారాన్ని చక్కబెట్టుకొని, ఆ తర్వాత తమ గురించి మాట్లాడాలని హితవు పలికారు. అలాగే, మజ్లిస్ పార్టీని నిషేదించాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పరిణీతి షిండేకు నోటీసులు పంపించినట్లు చెప్పారు.
కాగా, కొద్ది రోజుల క్రితం పరిణీతి షిండే మజ్లిస్ పార్టీని నిషేధించాలని డిమాండ్ చేశారు. దీని పైన అప్పుడే అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. అయితే, ఇప్పుడు నోటీసులు పంపించినట్లు తెలిపారు. మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.