దినకరన్ పార్టీతో కలిసి అసదుద్దీన్ ‘ఎంఐఎం’ పోటీ, ఎన్ని సీట్లంటే?: చిన్నమ్మ ఆశీస్సులున్నట్లేనా?
చెన్నై/హైదరాబాద్: ఏఐఎంఐఎం త్వరలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇందు కోసం అమ్మా మక్కల్ మున్నెట్రా కళగం(ఏఎంఎంకే) పార్టీతో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పొత్తు కుదుర్చుకున్నారు. పొత్తులో భాగంగా ఎంఐఎం పార్టీ మూడు స్థానాల నుంచి పోటీ చేయనుంది.
Recommended Video
దినకరన్ పార్టీతో పొత్తు: మూడు స్థానాల్లో ఎంఐఎం పోటీ
వినియంబడి, కృష్ణగిరి, శంకరపురం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంఐఎం పోటీ చేయనుంది. ఈ మేరకు టీటీవీ దినకర్ను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేగాక, మార్చి 12న చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీటీవీ దినకరన్ వెల్లడించారు. ఈ సభలో దినకరన్ తోపాటు అసుదుద్దీన్ ఓవైసీ కూడా ప్రసంగించనున్నారు.
శశికళ జైలుకెళ్లడంతో దినకరన్ కొత్త పార్టీ..
అవినీతి కేసులో నిందితురాలి ఉన్న దినకరన్ అత్త, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో అరెస్టైన సమయంలోనే శశికళను ఏఐఏడీఎంకే.. పార్టీ నుంచి తొలగించింది. ఈ క్రమంలో 2018 మార్చిలో దినకరన్ ఏఎంఎంకే పార్టీని స్థాపించారు. కాగా, రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికల్లో దినకరన్ పార్టీ ఆశించినస్థాయిలో ప్రభావమే చూపడం గమనార్హం.
శశికళ దినకరన్ పార్టీలో చేరతారనుకుంటే..
అయితే, జైలు నుంచి ఇటీవల విడుదలైన శశికళ తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జయలలిత పార్టీ అన్నాడీఎంకే(ఏఐఏడీఎంకే) విజయం కోసం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, మరోసారి బంగారు పాలన కోసం అమ్మ పార్టీకి విజయం కట్టబెట్టాలని ప్రజలను శశికళ కోరారు.
చిన్నమ్మ ఆశీస్సులు దినకరన్పైనే..?
మరోవైపు, జయలలిత నెచ్చెలి, తన అత్త శశకళ ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని దినకరన్ చెబుతుండటం గమనార్హం. దినకరన్ పార్టీ వర్గాలు కూడా శశికళ మద్దతుదారులు తమకు అండగా నిలబడతారని చెప్పుకొస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ శశికళను తొలగించిన నేపథ్యంలో ఆమె తన పార్టీలో చేరతారని దినకరన్ భావించినప్పటికీ.. ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. రాజకీయాల్లో లేకపోయినప్పటికీ.. శశికళ మద్దతుదారులు ఆమె సమీప బంధువైన దినకరన్ పార్టీకి మద్దతునిస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దినకరన్ పార్టీ, ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న హైదరాబాద్ పాతబస్తీ ఎంఐఎం పార్టీ ఏ మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తోందో మే 2నే తేలే అవకాశం ఉంది. కాగా, ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.