పాక్ ఆర్మీ ఛీఫ్ కు అసదుద్దీన్ ఓవైసీ మరో ఘాటు కౌంటర్..! అవన్నీ పిచ్చి మాటలు..!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ రాజకీయ నేతలు భారత్ పై చేస్తున్న వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ రాజకీయ నేతలవి అర్ధం లేని వ్యాఖ్యలన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి అసలు ఇస్లాం గురించి తెలియదన్నారు. అందుకే పాకిస్తాన్ విఫలదేశం అయ్యిందంటూ ఓవైసీ మరోసారి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
భారత్ పై నిత్యం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పై ఓవైసీ ఇవాళ మరోసారి ఫైర్ అయ్యారు. 1947లో విభజన సమయంలో భారత ముస్లింలు భారత్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు. 1947లో మేము భారతదేశాన్ని విడిచి వెళ్లకూడదని నిర్ణయించుకున్నామని, జిన్నా సందేశాన్ని తిరస్కరించామని ఆర్మీ ఛీఫ్ కు ఓవైసీ తెలిపారు. భారతదేశం మా భూమి, ఇది మా భూమి, భవిష్యత్తులోనూ మా భూమిగానే ఉంటుందన్నారు.

పాకిస్తాన్లో అర్ధంలేని మాటలు మాట్లాడే వారికి ఇస్లాం తెలియదని ఓవైసీ వ్యాఖ్యానించారు. దాని బోధనలను పాకిస్తాన్ నేతలు అర్దం చేసుకోవడం లేదని విమర్శించారు. 1947లో భారతదేశం నుండి వలస వచ్చిన ముహాజీర్లు, పఠాన్ల వంటి సామాజిక సమూహాలపై పాకిస్తాన్లో ఉన్న వివక్షను ఓవైసీ గుర్తుచేశారు. మీరు ముహాజీర్, పఠాన్లు అని పిలువబడే దేశంలో ఉన్నారు. మీ దేశం చాలా పేదది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు, మీకు ఆఫ్ఘనిస్తాన్తో విభేదాలు, ఇరాన్తో సరిహద్దు వివాదం ఉన్నాయి. ఫైనల్ గా పాకిస్తాన్ ఓ విఫలమైన దేశం అన్నారు.
पाकिस्तान एक नाकाम मुल्क है pic.twitter.com/qXFaMnQEOt
— Asaduddin Owaisi (@asadowaisi) May 3, 2025
భారత్ పై వరుసగా విమర్శలు చేస్తున్న పాకిస్తాన్ నేత బిలావల్ భుట్టో జర్దారీపైనా ఓవైసీ ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు ఉగ్రవాదం తన తల్లి, పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టోను చంపిందని గుర్తుంచుకోవాలని కోరారు. పాకిస్తాన్ భారతదేశం కంటే ఒక గంట వెనుకబడి ఉండటమే కాదు, అర్ధ శతాబ్దం వెనుకబడి ఉందన్నారు. కొన్ని శక్తులు భారతదేశాన్ని ఎప్పటికీ శాంతియుతంగా ఉండనివ్వవని అన్నారు.












Click it and Unblock the Notifications