వాహన తయారీ రంగానికి గడ్డు కాలం?: మారుతి సుజుకి బాటలో అశోక్ లేలాండ్
చెన్నై: దేశంలో అతిపెద్ద వాహన తయారీ రంగంలో ఒకటైన అశోక్ లేలాండ్ కూడా ఆకస్మిక సెలవును ప్రకటించింది. అయిదు రోజుాల పాటు వాహన తయారీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అశోక్ లేలాండ్ సంస్థకు చెందిన ప్రధాన తయారీ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై సమీపంలోని ఎన్నూర్ లో అశోక్ లేలాండ్ సంస్థకు అతిపెద్ద వాహన తయారీ యూనిట్ ఉంది. వేలాదిమంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. అయిదు రోజుల పాటు వాహనాల తయారీని నిలిపివేసినట్లు ఉద్యోగులందరికీ నోటిసులను జారీ చేసినట్లు తెలుస్తోంది.
డీకే కథ ముగిసినట్టేనా? ఇక కుమారస్వామి వంతు: సమన్లు జారీ చేసిన న్యాయస్థానం
దీనిపై అశోక్ లేలాండ్ యాజమాన్యం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా జారీ కాలేదు. ఆ సంస్థ యాజమాన్యం ఈ వార్తలను ధృవీకరించ లేదు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని అమలు చేయడం ఆరంభించిన తరువాత.. దాని ప్రభావం దేశంలోని ఆటోమొబైల్ రంగపై తీవ్రంగా పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత వాహనాల కొనుగోళ్లు మందగించాయని అంటున్నారు. మున్ముందు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్య అవకాశం ఉందని ముందే గ్రహించిన వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని నియంత్రించుకునే పనిలో పడ్డాయని విశ్లేషిస్తున్నాయి.
దాని ఫలితంగా మారుతి సుజుకి వంటి అతి పెద్ద వాహన తయారీ సంస్థ సైతం తన ఉత్పత్తిని తగ్గించుకుందని అంటున్నాయి. హర్యానాలోని గుర్ గావ్, మనేసర్ లోని మారుతి సుజుకి తయారీ యూనిట్లను వారంలో రెండురోజుల పాటు సెలవును ప్రకటించిన విషయాన్ని దీనికి ఉదహరిస్తున్నారు. తాజాగా అదే బాటలో మరో అతి పెద్ద వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ పయనిస్తోంది. హిందూజా గ్రూప్ నకు చెందిన ఈ సంస్థకు చెన్నై సమీపంలోని ఎన్నూర్ లో అతి పెద్ద యూనిట్ ఉంది. వాణిజ్య వాహనాలను ఈ యూనిట్ లో తయారు చేస్తారు. శుక్రవారం నుంచి అయిదురోజుల పాటు సెలవును ప్రకటించినట్లు సమాచారం.
శుక్రవారంతో కలుపుకొని శని, ఆది, మంగళ, బుధ వారాలను నాన్ వర్కింగ్ రోజులుగా ప్రకటించింది. సోమవారం ఒక్కరోజే యూనిట్ లో రోజువారీ కార్యకలాపాలు కొనసాగుతాయని అశోక్ లేలాండ్ యాజమాన్యం వెల్లడించినట్లు చెబుతున్నారు. వాహనాల తయారీని నియంత్రించాలని అశోక్ లేలాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల మార్కెట్ వర్గాల నుంచి సానుకూలత వ్యక్తం అవుతుండటం గమనార్హం. యాజమాన్యం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుందని చెబుతున్నాయి. ఈ వార్తలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అశోక్ లేలాండ్ ఇలాంటి నిర్ణయాన్నేదీ తీసుకోలేదని అంటున్నారు. సంస్థ యాజమాన్యం ఇప్పటిదాకా ఎలాంటి అధికారకి ప్రకటన చేయలేదని చెబుతున్నారు.