మృతదేహాన్ని తీసుకెళ్తోన్న వ్యాన్కు ఘోర ప్రమాదం: 18 మంది దుర్మరణం: గవర్నర్, సీఎం సంతాపం
కోల్కత: పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తీసుకుని వెళ్తోన్న మెటాడర్ వ్యాన్.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో చాలామంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు.
ఈ ఘటన పట్ల గవర్నర్ జగ్దీప్ ఢంకార్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి మమత బెనర్జీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. నాదియా జిల్లాలో హన్స్ఖలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్బరీ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ నార్త్ 24 పరగణా జిల్లా బాగ్దాకు చెందిన వారిగా గుర్తించారు. బాగ్దాలోని పర్మదాన్లో 74 సంవత్సరాల వృద్ధుడొకరు అనారోగ్య కారణాలతో మృతిచెందాడు.

మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించడానికి 24 మంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మెటడర్ వ్యాన్లో శ్మశాన వాటికకు బయలుదేరారు. హన్స్ఖలీ-కృష్ణానగర్ మార్గంలో ఉన్న నబద్వీప్ శ్మాశాన వాటికకు వారు చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యలో ఫుల్బరీ ప్రాంతానికి సమీపించిన వెంటనే రోడ్డుపై పార్క్ చేసి ఉంచిన లారీని వెనుక వైపు నుంచి అతివేగంగా ఢీ కొట్టింది మెటడర్. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుమంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే హన్స్ఖలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని శక్తినగర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎనిమిది చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. మరో ఆరుమంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లారీని ఢీ కొట్టిన వేగానికి మెటడర్ వ్యాన్ నుజ్జునుజ్జయింది. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. సంఘటనా స్థలం అంతా రక్తసిక్తమైంది.
ఈ ఘటన పట్ల గవర్నర్ జగ్దీప్ ఢంకర్, కేంద్రమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సంతాపాన్ని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్డు ప్రమాద సమాచారం తనను తీవ్రంగా కలచి వేసిందని మమత బెనర్జీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు.












Click it and Unblock the Notifications