బాలిలోనే చోటా రాజన్ను లేపేయాలనుకున్న దావూద్
ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. చోటా రాజన్ను చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడా? అంటే అవుననే అంటున్నారు. దావూద్ వేసిన ప్లాన్ కొద్దిలో తప్పిపోవడంతో చోటా రాజన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్ వెలుగు చూసింది.
చోటా రాజన్ను దావూద్ ఇబ్రహీం ఎలా చంపాలనకున్నది... దావూద్ అనుచరుడు చోటా షకీల్ ఆడియో సందేశంలో కనిపించింది. ఇండోనేషియాలోనే చోటా రాజన్ను దావూద్ చంపేయాలనుకున్నాడు. చోటా షకీల్ ఆ ప్లాన్ను వివరించాడు.
ఓ మీడియా సంస్థ ప్రతినిధికి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. చోటా రాజన్ను లాకప్లోనే చంపేస్తారా? అన్న ఓ ప్రశ్నకు ఫోన్లో వేగంగా స్పందించిన షకీల్... రాజన్ చంపేసేందుకు ఇండోనేసియా నగరం బాలిలోనే ప్లాన్ వేశామని చెప్పాడు.
కొంతమేర సమాచారం రాని నేపథ్యంలోనే తమ ప్లాన్ విఫలమైందన్నాడు. అతనిని భారత్లో అంతే చేస్తామన్నాడు. బాలిలో అరెస్ట్ తర్వాత చోటా రాజన్ పలుమార్లు మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో ఓ పురుషుడితో పాటు మహిళను జర్నలిస్ట్గా రంగంలోకి దించామని చోటా షకీల్ చెప్పాడు.
సదరు నకిలీ విలేకర్లకు ఐడీ కార్డులతో పాటు కెమెరాలు కూడా అందించామన్నాడు. జర్నలిస్టుల రూపంలో రాజన్ వద్దకు వెళ్లిన తర్వాత ఆ మహిళ రాజన్ పైన కాల్పులు జరపాలని తాము ప్లాన్ వేశామన్నాడు. అయితే అంతమంది దగ్గరగా ఉన్న సమయంలో ఆయుధం తీసి అతన్ని కాల్చేందుకు వీలుకాలేదన్నాడు.