నేటినుండి అయోధ్యలో ప్రాణప్రతిష్ట ముందస్తు ఆచారాలు ప్రారంభం; 56 దేశాలవారికి ఆహ్వానం!!
హిందువులంతా ఎంతో భక్తి భావంతో ఎంతో ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీ రాముని ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతుంది. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా రామ మందిర ప్రారంభోత్సవం జరగాలని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 22వ తేదీన జరగనున్న ఈ మహా క్రతువులో దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరుకానున్నారు.
అయితే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఆచారాలు, నియమాలు మకర సంక్రాంతి పండుగ నుండి, అంటే నేటి నుండే ప్రారంభమయ్యాయి. అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనే 11 మంది పుణ్య దంపతులు నేటి నుండి 45 నియమాలను పాటించనున్నారు. నేడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ దంపతులు అందరూ మొదటి స్నానం చేసి ఎనిమిది రోజులపాటు ఈ నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలలో పాల్గొనే 11 మంది దంపతులకు పాటించవలసిన నియమాలను తెలియజేసింది. వీరంతా ఈ ఎనిమిది రోజులపాటు అత్యంత నిష్ఠతో శ్రీరామునికి పూజలు చేయాలి. నిరంతరం రామనామ జపం చేయాలి. సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ సాత్వికమైన జీవనశైలి ఉండేలా చూసుకోవాలి.
ఇదిలా ఉంటే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి, శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట ఆహ్వానాలను ఇప్పటికే దేశ విదేశాలలోని ప్రముఖులకు అందజేశారు. అయితే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాలను 56 దేశాలలో ఇస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్ నేత అలోక్ కుమార్ వెల్లడించారు. 56 దేశాలలో మొత్తం పది కోట్ల మందికి ఆహ్వానాలు అందించాలని తాము ప్లాన్ చేసుకున్నట్టు ఆయన తెలిపారు.
ఆయా దేశాలలో ఉన్న వారు ఈ ప్రాణ ప్రతిష్టను వీక్షించడానికి వారికి దగ్గరలో ఉన్న ఆలయానికి అయినా రావాలని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. జనవరి 22న అభిజిత్ లగ్నంలో కేవలం 84సెకన్ల కాలంలో వైదిక సాంప్రదాయాలను అనుసరించి బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications