షాహీ ఇమామ్ ఓ ఆర్ఎస్ఎస్ ఏజెంట్: అజాంఖాన్
రాంపూర్: ఢిల్లీ జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఓ ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ఏజెంట్ అని ఉత్తరప్రదేశ్ మంత్రి, సమాజ్వాది పార్టీ సీనియర్ నాయకుడు అజాంఖాన్ అన్నారు. అజాంఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు ఓ హిందూ యువతిని పెళ్లి చేసుకుంటే ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రకంపనలు సృష్టించిందని మండిపడ్డారు.
ప్రస్తుతం బుఖారీ కుమారుడు సైతం హిందూ యువతినే వివాహం చేసుకున్నాడని.. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. వాళ్ల విషయంలో ఆర్ఎస్ఎస్కు ఇప్పడు లవ్ జీహాద్ గుర్తుకు రావడం లేదని అన్నారు.
భారతీయ జనతా పార్టీ ఎజెండాలో భాగంగా ముస్లీం వర్గాన్ని బుఖారి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బుఖారీ మతపరమైన విషయాల్లో నిమగ్నమైతే మంచిదని సూచించారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తలదూర్చొద్దని అజాంఖాన్ ఇదివరకే ఇమామ్ను విమర్శించిన విషయం తెలిసిందే.
కాగా, తమ మతానికి కళంకంగా మారిన అజాంఖాన్ను ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం నుంచి తొలగించాలని ఇటీవల బుఖారీ డిమాండ్ చేశారు.
అజాంఖాన్ వల్ల మొత్తం ముస్లిం వర్గానికే చెడ్డ పేరు వస్తోందని, వెంటనే అతడ్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు, సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్కు లేఖ రాశారు. అంతేగాక, ఖాన్ను మంత్రివర్గం నుంచి తొలగించకపోతే 2017లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీకి పరాజయం తప్పదని హెచ్చరించారు.