రాహుల్ ఓ అమాయక పిల్లాడు: అజాంఖాన్
లక్నో: జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ అమాయక బాలుడిగా అభివర్ణించారు సమాజ్వాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అజాంఖాన్. బుదాన్లో శుక్రవారం రాత్రి ఆయన రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి సభా వేదికలపై సొంతంగా మాట్లాడే సత్తా లేదని, ఎవరో రాసి ఇస్తే తప్ప ప్రసంగించలేరని ఆయన విమర్శించారు.

రాహుల్ గాంధీ ఓ అమాయక బాలుడని, ఇదే విషయాన్నిగతంలో యోగా గురువు బాబా రాందేవ్ కూడా చెప్పారని అజాంఖాన్ గుర్తు చేశారు. కాంగ్రెస్పై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో మత ఘర్షణలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన మండిపడ్డారు. భారతదేశంలో మత ఘర్షణలకు కాంగ్రెస్ పార్టీయే పునాదులు వేసిందని అజాంఖాన్ ఆరోపించారు.
జనం రారని రాహుల్ సభలు రద్దు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. రాహుల్ గాంధీ హాజరయ్యే సభలకు ఎక్కువగా జనాలు రారనే భయంతో సభలను రద్దు చేశారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 22న హమీర్పూర్, సలీప్పూర్లో తలపెట్టిన రెండు సభలను.. అదే రోజు హిందువులు ఘనంగా జరుపుకునే కార్వచవతి పండగ ఉండడంతో ఆ పార్టీ నేతలు రద్దు చేశారు.
ఆ రోజున పగలంతా పూజా కార్యక్రమాలు నిర్వహించి రాత్రి పూట చంద్రుణ్ని దర్శించుకుంటే శుభం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉండడంతో తమ సభలకు ప్రజలు రారనే భయం నేతలకు పట్టుకుంది. దీంతో ప్రజలను సభలకు తరలించడం కష్టమవుతుందనే భావనతో సభలను రద్దు చేశారు. ఇటీవల అలీగఢ్, రాంపూర్ లో నిర్వహించిన రాహుల్ సభలకు జనాలు అంతగా రాకపోవడంతో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. అత్యధిక పార్లమెంట్ స్థానాలున్న తమ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి రావడంతో స్థానిక నాయకుల్లో పార్టీ పరిస్థితిపై ఆందోళన నెలకొన్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications