ఉమా భారతి సంచలనం: 'బాబ్రీ' కేసులో ఉరి తీయించుకోవడానికైనా సిద్దమే!..
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణకే కాదు.. అవసరమైతే ఉరి తీయించుకోవడానికైనా తాను సిద్దమేనని ప్రకటించారు.
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సహా ఆ పార్టీ నేతలు ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి తదితరులపై బాబ్రీ కుట్ర కేసును తిరగదోడుతూ సుప్రీంకోర్టు పునర్విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. వీరందరిని కుట్రదారులుగా చేర్చి కేసును పునర్విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ఉమాభారతి ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్పందించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణకే కాదు.. అవసరమైతే ఉరి తీయించుకోవడానికైనా తాను సిద్దమేనని ప్రకటించారు. రెండేళ్ల కాలంలో కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో.. విచారణ రెండు గంటలైనా, రెండేళ్లయినా ఎదుర్కోవడానికి తాను సిద్దమన్నారు.
కోర్టు తీర్పు తర్వాత తానెవరితో మాట్లాడలేదని, ఎట్టి పరిస్థితుల్లోను రామ మందిరాన్ని నిర్మించాలనే తాను చెప్పాలనకుంటున్నాని ఉమాభారతి అన్నారు. తనను రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తిరంగా వివాదం సమయంలో తనపై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయి కాబట్టే రాజీనామా చేశానని గుర్తుచేశారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో తాను ఈరోజే అయోధ్య వెళ్తానని ఉమాభారతి తెలిపారు. కాంగ్రెస్ ఆరోపణల మీద స్పందించబోనని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పై ఉమాభారతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1984సమయంలో ఎమర్జెన్సీ విధించి మరీ.. ముస్లింలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఉమాభారతి ఆరోపించారు.
రామ మందిరం అంశం వల్లే తాము అధికారంలోకి వచ్చామని, దాన్ని కట్టే విషయంలో కచ్చితంగా ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. ఎలాంటి తీర్పునైనా సరే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాని తెలిపారు.