ఏమి ప్రయోగమిది! బట్టతలతో కనువిప్పు కలిగేలా చేసిన మంత్రి
భోపాల్ : బట్టతలతోను సమాజానికి నీతి బోధించవచ్చునని నిరూపించారు మధ్యప్రదేశ్ మంత్రి అంతార్ సింగ్ ఆర్య. సాధారణంగా మాటల్లో చెప్పే విషయాన్ని ప్రాక్టికల్ గా జనం కళ్ల ముందుంచితే విషయం త్వరగా ప్రజలకు అర్థమవుతుంది. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ బట్టతల ప్రయోగం చేశారు అంతార్ సింగ్.
పర్యావరణ మంత్రిగా ఉన్న అంతార్ సింగ్.. మధ్యప్రదేశ్ లో మొక్కల పెంపకంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే అందరిలా స్పీచులు దంచి.. చెప్పిందే చెప్పడం సదరు మంత్రి గారికి అసలు గిట్టదట. దీంతో ఓ బట్టతల ఉన్న వ్యక్తిని స్టేజీ మీదకు పిలిచి.. ఆ బట్టతలతో జనానికి కనువిప్పు గలిగేలా చేశారు మంత్రి అంతార్ సింగ్.

ఇంతకీ ఆయనేం చేశారంటే..! పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఓ గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. జనమంతా మంత్రి గారు ఏం చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ బట్టతల వ్యక్తిని, మరో జుత్తున్న వ్యక్తిని.. ఇద్దరినీ వేదిక మీదకు పిలిచారు అంతార్ సింగ్. ఆ తర్వాత ఇద్దరి తలల పైన అంతార్ సింగ్ నీళ్లు కుమ్మరించారు. అనంతరం ఓ టవల్ తో ఇద్దరి తలలను తుడిచారు.
ఇదంతా అయ్యాక.. ఇప్పుడు చెప్పండి..? 'బట్టతలపై నీళ్ళు నిలిచాయా? జుత్తున్న తలపై నీళ్లు నిలిచాయా?' అంటూ జనాలను సూటిగా ప్రశ్నించారు. దీని ద్వారా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే.. తల మీద జుత్తు లాగే రాష్ట్రంలో చెట్లు నిండుగా ఉన్నప్పుడు వర్షపు నీటిని కాపాడుకోవచ్చు. ఇక బట్టతల మీద జుత్తు లేనట్లు, నేల మీద కూడా చెట్లు, అడవులు లేకుండా పోతే వర్షం నీటిని కాపాడుకోవడం కష్టం అనేది ఈ బట్టతల ప్రయోగం ద్వారా ప్రజలకు ప్రాక్టికల్ గా చూపించారు మంత్రి అంతార్ సింగ్.












Click it and Unblock the Notifications