రెడ్డి కులాన్ని బీసీల్లో చేర్చాలి, గాలి జనార్దన్ రెడ్డి, నేను సీఎం !
రెడ్డి కులాన్ని బీసీ ‘ఏ’లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నేను సీఎం కావాలని, రాజకీయంగా మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశకూడా నాకు లేదని.
బెంగళూరు: ప్రాణం ఉన్నంత వరకు రెడ్డి కులం అభివృద్ది కోసం తాను శక్తివంచన లేకుండా పోరాటం చేస్తానని మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్డన్ రెడ్డి అన్నారు. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి ఐదేళ్ల తరువాత ఓ భారీ బహిరంగ సభలో మొదటిసారి మాట్లాడారు.
బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఇటీవల జరిగిన రెడ్డి జనసంఘ బహిరంగ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప హాజరైనారు. బెంగళూరులోని బోమ్మనహళ్ళి ఎమ్మెల్యే (బీజేపీ) సతీష్ రెడ్డి యడ్యూరప్పను రెడ్డి జనసంఘ సమావేశ వేదిక మీదకు తీసుకు వెళ్లారు.
యడ్యూరప్ప వెనుకనే ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని వేదిక మీదకు తీసుకు వెళ్లి మైక్ ఇచ్చారు. ఈ సందర్బంలో బహిరంగ సభను ఉద్దేశించి గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం నేను రెడ్డి కావడం వలనే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పడంతో అక్కడ ఉన్న వారు కొట్టిన చప్పట్లతో సభ దద్దరిల్లింది.
నేను సీఎం కావాలని రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయంగా మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశకూడా నాకు లేదు. కేవలం నా పేరు వెనుక రెడ్డి అని ఉన్నందుకే నేను ఈ స్థాయికి చేరుకున్నానని గాలిజనార్దన్ రెడ్డి అన్నారు.
రెడ్డి కులం కుటుంబ సభ్యులు ఉన్నతస్థాయికి చేరుకోవడానికి తాను శక్తివంచన లేకుండా పోరాటం చేస్తానని అన్నారు. రెడ్డి కులాన్ని బీసీ 'ఏ'లో చేర్చాలని, అందు వలన మన వర్గానికి రిజర్వేషన్లు ఎక్కవ వస్తాయని చాలకాలం నుంచి పోరాటం చేస్తున్నామని ఇదే సమయంలో గుర్తు చేశారు.
రెడ్డి కులాన్ని బీసీ 'ఏ'లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సభాముఖంగా మనవి చేశారు. వేమన జయంతి, వేమరెడ్డి మల్లమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గాలి జనార్దనరెడ్డి మనవి చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కేంద్ర మాజీ మంత్రులు మల్లికార్జున ఖార్గే, వీరప్ప మోయిలి తదితరుల సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి ఐదేళ్ల తరువాత బహిరంగ సభలో ఆవేశంగా ప్రసగించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని గాలి అనుచరులు అంటున్నారు. అయితే రెడ్డి జనసంఘ సమావేశం సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి ప్రసగించారని ఆ వర్గానికి చెందిన ప్రముఖులు చెబుతున్నారు. ఈ సమావేశంలో కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి రెడ్డి కులానికి చెందిన ప్రముఖ నాయకులు, పారిశ్రామివేత్తలు హాజరైనారు.