ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం, బంద్, సీఎం మీటింగ్, బళ్లారి శ్రీరాములుకు ఏం తెలుసు!
బెంగళూరు: ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ఆగస్టు 2వ తేదీ 13 జిల్లాల బంద్ కు ఆ ప్రాంతంలోని నాయకులు పిలుపునిచ్చారు. ఉత్తర కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చిన ఆ ప్రాంతంలోని నాయకులు, మద్దతు ఇస్తున్న అన్ని సంఘాలతో చర్చించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యింది. సీఎం కుమారస్వామి అత్యవరసంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. బళ్లారి శ్రీరాములుకు ఏం తెలుసు ? అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

సీఎం కుమారస్వామి
ఉత్తర కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చిన అన్ని సంఘాలతో చర్చించడానికి తాము సిద్దంగా ఉన్నామని, వెంటనే సమావేశానికి రావాలని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మనవి చేశారు. బంద్ తో ప్రజలను ఇబ్బందులకు గురి చెయ్యకూడదని సీఎం కుమారస్వామి సూచించారు.

నిర్లక్షం చేశారు
ఉత్తర కర్ణాటకను నిర్లక్షం చేస్తూ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి 2018-19 బడ్జెట్ ప్రవేశ పెట్టారని, ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే మా ప్రాంతాలను మేమే అభివృద్ది చేసుకుంటామని ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం పోరాట సమితి అధ్యక్షుడు సోమశేఖర్ కూతెంబరి అంటున్నారు.

బీజేపీ తీర్మాణం
ఆగస్టు 2వ తేదీ ఉత్తర కర్ణాటక బంద్ కు పిలుపునివ్వడంతో బీజేపీ కర్ణాటక శాఖ స్పందించింది. ఉత్తర కర్ణాటక బంద్ కు తాము మద్దతు ఇవ్వమని బీజేపీ నాయకులు తేల్చి చెప్పారు. బంద్ కు బీజేపీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు మద్దతు ఇవ్వకూడదని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఆదేశాలు జారీ చేశారు.

బళ్లారి శ్రీరాములుకు ఏం తెలుసు ?
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములకు ఉత్తర కర్ణాటక గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని, ఆయనకు ఈ ప్రాంతం మీద ఎలాంటి అవగాహనలేదని కేపీసీసీ (కాంగ్రెస్) వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే మండిపడ్డారు. ఉత్తర కర్ణాటక బంద్ కు కాంగ్రెస్ మద్దతు లేదని ఈశ్వర్ ఖండ్రే స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఆందోళన ?
ఆగస్టు 2వ తేదీ ఉత్తర కర్ణాటక బంద్ విజయవంతం అయితే ప్రత్యేక రాష్ట్రం పోరాటం మరింత బలపడే అవకాశం ఉందని కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నాయకులు ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఉత్తర కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చిన అన్ని సంఘాలతో జులై 31వ తేదీ చర్చించి సమస్యలు పరిష్కారం చెయ్యడానికి చర్యలు తీసుకోవాలని సీఎం హెచ్.డి. కుమారస్వామి నిర్ణయించారు.












Click it and Unblock the Notifications