కంపు కొట్టే టాయిలెట్స్,పనిచేయని ఫ్యాన్స్.. నరకం అంటున్న వైద్యులు..
కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు కొన్నిచోట్ల సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. ఇంతటి విపత్కర సమయంలోనూ తమ పట్ల నిర్లక్ష్యం వహించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రత,సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని ప్రజలకు వైద్యులు సూచిస్తున్న వేళ.. తామే ఆ రెండింటికి దూరం కావాల్సిన అద్వాన్న స్థితిలో ఉన్నామని ఉత్తరప్రదేశ్కి చెందిన కొంతమంది డాక్టర్లు ఓ వీడియోలో వాపోయారు. బరేలీ జిల్లాలో కోవిడ్-19 విధుల్లో ఉన్న తమకు ప్రభుత్వం ఎంత నాసిరకం ఏర్పాట్లు చేసిందో వీడియోల ద్వారా బయటపెట్టారు.

ఎంత అద్వాన్న పరిస్థితుల్లో ఉన్నారంటే..
బరేలీ జిల్లాలో కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న కొంతమంది వైద్యులు,పారామెడికల్ స్టాఫ్కి స్థానిక అధికారులు ఓ స్కూల్లో బస ఏర్పాటు చేశారు. దాన్నే క్వారెంటైన్ కేంద్రంగా మార్చి అందులోనే వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడి పరిస్థితులు అత్యంత అద్వాన్నంగా ఉన్నాయని చెబుతూ.. వైద్యులు మూడు వీడియోలను బయటపెట్టారు. మొదటి వీడియోను బుధవారం తెల్లవారుజామున 3గంటలకు బయటపెట్టారు. 'విద్యుత్ లేదు.. ఒక్క గదిలో నలుగురం ఉంటున్నాం. కనీసం ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు. కామన్ బాత్రూమ్స్ చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. యూరినల్స్కి పైప్స్ లేవు, టాయిలెట్స్ దుర్గంధం భరించలేకపోతున్నాం.' అంటూ అక్కడి విజువల్స్ను ఆ వీడియోలో చూపించారు.

రెండో వీడియోలో..
రెండో వీడియోలో తమకు అందిస్తున్న ఆహారం ఎంత అపరిశుభ్రంగా ఉందో చూపించారు. పాలీథిన్ కవర్లలో కుక్కిన పూరీలు,కర్రీని ఒక పెట్టెలో ఎలా కుక్కి పంపించారో చూపించారు. మూడో వీడియోలో ఓ డాక్టర్ మాట్లాడుతూ.. 'ఒక స్కూల్లోని తరగతి గదుల్లో పడుకోవడానికి మాకు బెడ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో నాలుగు బెడ్స్ ఉన్నాయి. క్వారెంటైన్ నిబంధనలకు ఇది విరుద్దం. టాయిలెంట్స్ అత్యంత దుర్గంధంగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తే మొబైల్ టాయిలెట్స్ పంపించారు.అందులో రాత్రిపూట విద్యుత్ ఉండదు. నిన్న రాత్రి 20లీటర్ల వాటర్ క్యాన్ ఇచ్చి.. అందరూ అదే వాడుకోవాలని చెప్పారు.' అని వాపోయారు.

రాత్రికి రాత్రే వేరే చోటుకు..
వైద్యుల వీడియోలు బయటకు రావడంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. తమ పరిస్థితి గురించి ఆ వైద్యులు రాష్ట్ర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.ఎస్కె శర్మకు లేఖ కూడా రాశారు. దీంతో వెంటనే ఆయన ఆ స్కూల్ను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. బుధవారం రాత్రికి రాత్రే వైద్యులు,పారామెడికల్ స్టాఫ్ను అక్కడి నుంచి మరోచోటుకు తరలించారు. ' ఆ స్కూల్ను స్వయంగా సందర్శించాను. అక్కడ సౌకర్యాలు సరిగా లేవు. స్థానిక అధికారుల సాయంతో వైద్యులు,పారామెడికల్ సిబ్బందిని సమీపంలోని గెస్ట్ హౌజ్కు తరలించాం. అక్కడ వారికి కావాల్సిన అన్నిరకాల సదుపాయాలు,సౌకర్యాలు ఉన్నాయి.' అని ఎస్కే శర్మ తెలిపారు.

వైద్యుల రక్షణకే తొలి ప్రాధాన్యం..
కరోనా వైరస్పై పోరులో వైద్యులు,నర్సుల రక్షణకే తమ తొలి ప్రాధాన్యమని ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు,వైద్యుల రక్షణ,ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినా.. వారి పట్ల నిర్లక్ష్యం వహించినా.. నాన్ బెయిలబుల్ శిక్షలు తప్పవని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా పాస్ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యుల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి.












Click it and Unblock the Notifications