ఢిల్లీలో బార్లు ఇక బార్లా: తెల్లవారుజామున 3 గంటల వరకు ఓపెన్, కస్టమర్లకు సౌకర్యాలు
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మద్యం ప్రియులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏకంగా తెల్లవారుజామున 3 గంటల వరకూ బార్లు, క్లబ్లు, రెస్టారెంట్లు తమ కస్టమర్లకు మద్యం సరఫరా చేసేందుకు అనుమతులు ఇచ్చింది. అంతేగాక, విశాలమైన, ఎయిర్ కండీషన్డ్ షాపులు ప్రారంభించేలా చర్యలు ప్రారంభించింది.
నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఢిల్లీ నగరంలోని మొత్తం జోన్లలో దేశీయ, విదేశీ మద్యం లైసెన్స్లు జారీ చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. వీటిని మార్కెట్లు, మాల్స్, లోకల్ షాపింగ్ కాంప్లెక్స్లు, వాణిజ్య సముదాయాలు వంటి చోట్ల ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేగాక, కస్టమర్లకు వాకిన్ అనుభవం ఉండేలా షాపులను డిజైన్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. బయట కౌంటర్ ఏర్పాటు చేసి జనాలు గుమిగూడకుండా చూడాలని స్పష్టం చేసింది.
ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి దుకాణంలో గాజు తలుపులు, ఎయిర్ కండీషన్లు ఏర్పాటు చేయాలని, దుకాణాల లోపల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. కనీసం నెల రోజుల సీసీటీవీ ఫుటేజీలను భద్రతపర్చాలని పేర్కొంది.
ఢిల్లీ నగరంలో మొత్తం 272 మున్సిపల్ వార్డులు, 68 అసెంబ్లీ నియోజకవర్గాలు, 30 జోన్లు ఉన్నాయి. నూతన పాలసీ ప్రకారం ప్రతి జోన్కు 27 మద్యం దుకాణాలను కేటాయించారు. అంటే ఒక్కో వార్డుకు మూడు మద్యం దుకాణాలుంటాయి. కంటోన్మెంట్ ప్రాంతంలో 29 మద్యం దుకాణాలు ఉండగా, అంతర్జాయతీ విమనాశ్రయం సమీపంలో 10 దుకాణాలు ఉండనున్నాయి.