మూడేళ్లలో బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టు: నిర్మలా సీతారామన్కు థ్యాంక్స్: యడియూరప్ప
బెంగళూరు: ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ట్రాఫిక్ వ్యవస్థ ఉన్న నగరంగా గుర్తింపు తెచ్చుకుంది బెంగళూరు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 415 నగరాల్లో సర్వే నిర్వహించగా.. బెంగళూరులో ఉన్నంత భయానక ట్రాఫిక్ మరే ఇతర నగరంలోనూ లేదని తేలింది. అలాంటి బెంగళూరులో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపర్చడానికి సబర్బన్ రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం 18,600 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది కేంద్రం.
మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్: 13 మందితో: ఆశావహుల సంఖ్య భారీగా..!
భారీగా నిధులను కేటాయించడాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఙతలు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన బెంగళూరులో రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగడితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే మూడేళ్లలో బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. నిధులను దశలవారీగా కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
త్వరలోనే పనులను ఆరంభిస్తామని చెప్పారు. ఏఏ ప్రాంతాల మీదుగా సబర్వన్ రైల్వేను నడిపించాలనే విషయంపై ఇదివరకే ఓ సర్వే నిర్వహించామని అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆ సర్వే నివేదికలు గానీ, డీపీఆర్లల్లో గానీ మార్పులు చేయాల్సి ఉండొచ్చని చెప్పారు. వాహనాల రద్దీని నివారించడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని అన్నారు. మిగిలిన నగరాలతో పోల్చి చూస్తే.. బెంగళూరులో వ్యక్తిగత వాహనాల వినియోగం అధికంగా ఉందని యడియూరప్ప చెప్పారు.
బెంగళూరు నగర ట్రాఫిక్ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని సబర్బన్ రైల్వే ప్రాజెక్టును కేటాయించాలంటూ తాము చాలాకాలం నుంచీ కేంద్రాన్ని కోరుతూ వస్తున్నామని అన్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు కోసం భారీగా నిధులను కేటాయించిన నిర్మలా సీతారామన్కు కృతజ్ఙతలు తెలియజేస్తున్నామని సురేష్ అంగడి చెప్పారు. ఈ నెల 5వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నామని యడియూరప్ప తెలిపారు. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, భారీ నీటి ప్రాజెక్టులు.. వంటి ప్రాధాన్యత శాఖల వారీగా నిధులను కేటాయించామని వెల్లడించారు.