వరుడ్ని ముద్దాడిన వదిన: పెళ్లి మంటపం నుంచి వెళ్లిపోయిన వధువు
అలీఘర్: ఓ చిన్న కారణంతో పెళ్లయిన కొద్ది క్షణాలకే నూతన వధూవరులు విడిపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్లో గురువారం రాత్రి ఓ పెళ్లి మంటపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన తర్వత అందంగా ముస్తాబైన వరుడ్ని అతని వదిన(అన్నయ్య భార్య) ముద్దొస్తున్నావంటూ ముద్దాడింది. ఈ సమయంలో అక్కడే ఉన్న వధువు, ఆమె కుటుంబసభ్యులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
పెళ్లి సందర్భంగా వరుడితో కలిసి వదిన నృత్యాలు చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు కుటుంబసభ్యులు.. వరుడి కుటుంబసభ్యులతో వివాదానికి దిగారు. పెళ్లి మంటం నుంచి వధువు వెళ్లిపోయింది. వివాహానికి హాజరైన అతిథులు వివాదాన్ని సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు. కాగా, వరుడి కుటుంబసభ్యులను బంధించిన వధువు కుటుంబసభ్యులు, బరాత్ కోసం వచ్చిన వారిపై దాడి చేశారు.
ఈ వివాహానికి హాజరైన అలీఘర్ మేయర్ శకుంతలా భారతి మాట్లాడుతూ.. వరుడు, వధువు కుటుంబసభ్యుల మధ్య వివాదం జరిగిందని చెప్పారు. అతను బంధించబడి ఉన్నాడని తెలిపారు. అది వారి వ్యక్తిగత విషయమైనప్పటికీ.. అతడ్ని విడిపించేందుకు తను కలగజేసుకోక తప్పలేదని అన్నారు.
తాను నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. అయితే వారు ఒకరి కుటుంబంపై మరొకరు దూషణలు చేసుకుంటున్నారని చెప్పారు. రెండు కుటుంబాలకు చెందిన వారు విద్యావంతులేనని తెలిపారు. ఈ ఘటనతో తను ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపారు. వరుడు వధువును తనతో తీసుకెళ్లకుండానే వెళ్లిపోయాడని చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు వివాదాన్ని సద్దమణిగేలా చూసేందుకు వచ్చినప్పటికీ.. ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోలేదని భారతి చెప్పారు. కాగా, ఇరు కుటుంబాల వారు ఫిర్యాదు చేయనందున తాము ఆ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని పోలీసులు తెలిపారు.