సరిహద్దుల్లో చైనాకు భారత్ ఊహించని షాక్
అరుణాచల్ ప్రదేశ్ తనదేనంటూ పదే పదే కవ్వింపులకు పాల్పడుతున్న చైనాకు భారత్ ఊహించని షాక్ ఇచ్చింది. 60 టన్నుల బరువుండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకొని దేశ సరిహద్దులకు సులభంగా చేరుకోవడానికి నీటిలో అతి పొడవైన వంతెనను నిర్మించింది. భారత సైన్యంలో ఉండే టీ-72, అర్జున్ లాంటి భారీ యుద్ధ ట్యాంకులను ఈ వంతెన ద్వారా సరిహద్దుల్లోకి సులభంగా తీసుకుపోవచ్చు. కీలకమైన సమయాల్లో సైనికులను తరలించడానికి కూడా ఈ వంతెన ఉపయోగపడుతుంది. మొత్తం 9.15 కిలోమీటర్ల పొడవుండే ఈ సేతు అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతోంది.
అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో దక్షిణ దిక్కులో ఉన్న ధొలా నుంచి ఉత్తర దిక్కులో ఉన్న సాదియా గ్రామాన్ని కలుపుతూ ఈ వంతెనను భారత ప్రభుత్వం నిర్మించింది. బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా ఉన్న లోహిత్పై నిర్మించడంతో దీనిని ధొలా సాదియా బ్రిడ్జ్గా పిలుస్తారు. నీటిలో స్తంభాలపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా ఇది రికార్డు సృష్టించింది. దేశ రక్షణకు కీలకంగా ఉండటంతోపాటు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు సమయాన్ని కుదించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అస్సాంకు చెందిన రచయిత, నటుడు, నిర్మాత భూపేన్ హజారికా పేరును ఈ వంతెనకు పెట్టారు. భూపేన్ హజారికా సేతుగా నామకరణం చేసింది.
హైదరాబాద్కు చెందిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ వెయ్యి కోట్లరూపాయల వ్యయంతో దీన్ని నిర్మించింది. 2011 నవంబరులో నిర్మాణాన్ని ప్రారంభించి 2017లో పూర్తిచేసింది. ఈ వంతెనవల్ల అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రకృతి దృశ్యాలను వీక్షించడానికి, బౌద్ధారామాలను చూడాలనుకునేవారు ఈ వంతెన మీదగా ప్రయాణం చేయవచ్చు. తిన్సుకియాకి 17 కిలోమీటర్ల దూరంలోని బెల్ టెంపుల్ ఉంది. ఇక్కడ కొలువైన పరమ శివుడికి ఒక గంట బహూకరిస్తే కోర్కెలు నెరవేరతాయన్నది భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టుకు గంటను కట్టి భక్తులు తమ కోర్కెలు ఆ భగవంతుడికి విన్నవించుకుంటారు