పెద్దనోట్ల రద్దుతో పెళ్లి రద్దు: మోడీకి కృతజ్ఞతలు తెలిపిన వధువు!
పెద్ద నోట్ల రద్దు కారణంగా తన పెళ్లి ఆగిపోవడంతో ఓ వధువు సంతోషం వ్యక్తం చేసింది. అంతేగాక, ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలిపడం గమనార్హం.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలువురు తమ కూతుళ్లకు పెళ్లి కూడా చేసుకోలేకపోతున్నారని విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, పెద్ద నోట్ల రద్దు కారణంగా తన పెళ్లి ఆగిపోవడంతో ఓ వధువు సంతోషం వ్యక్తం చేసింది. అంతేగాక, ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలిపడం గమనార్హం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన కవిత అనే యువతి లాయర్గా ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెకు ఎనిమిది నెలల క్రితం ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటీవ్గా పనిచేస్తున్న విక్కీతో పెళ్లి నిశ్చయమైంది. నవంబర్ 25న వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే గత ఎనిమిది నెలలుగా వరుడి కుటుంబీకుల ప్రవర్తన తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో వధువు తరపు వారు పెళ్లి రద్దు చేసుకోవాలనుకున్నారు.
కానీ, ఎలాగో వారికి అర్థం కాలేదు. తీరా చూస్తే వరుడి కుటుంబీకులు కట్నం కోసం ఆశ పడుతున్నట్లు అర్థమైంది. పెద్దనోట్ల రద్దుతో కారు, సామాగ్రి కొనివ్వడానికి కాస్త సమయం పడుతుందని వరుడి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో పెళ్లి రద్దయింది.
'కట్నం అందరూ ఇచ్చేదే. ఇది కొన్న తరాలుగా వస్తున్న భారతీయ సంప్రదాయం. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వచ్చేవరకు మీరు కట్న కానుకలు ఇవ్వకుండా ఎందుకు ఆగారు మాకు రావాల్సింది ఇవ్వకుండా కావాలనే ఇంతకాలం ఆగారు' అని వరుడి కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు ఇద్దరూ కూతుళ్లేనని బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం వారికే చెందుతుందని ఎంతచెప్తున్నా వరుడి కుటుంబీకులు ఒప్పుకోలేదు. ఆభరణాలు, కారు కొనేవరకు పెళ్లివాయిదా వేయాలని పట్టుబట్టారు. వివాహానికి సమయం దగ్గర పడటంతో వాయిదా వేయడానికి కవిత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో వరుడి కుటుంబీకులు పెళ్లి రద్దు చేసుకున్నారు.
కాగా, డబ్బు కోసం పెళ్లినే రద్దు చేసుకున్న వ్యక్తి తనకు భర్తగా రాకపోవడమే మంచిదైందని, ప్రధాని మోడీ నిర్ణయంతో తనకు పరోక్షంగా మంచే చేసిందని వధువు కవింత అన్నారు. అంతేగాక, అలాంటి వ్యక్తితో పెళ్లి రద్దైనందుకు మోడీకి ఆ వధువు ధన్యవాదాలు తెలిపారు.