ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి ఆయనే!!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు.. అన్నదానికి నితీష్ కుమార్ మంచి ఉదాహరణ. నిజాయితీ పరుడైన రాజకీయనేతగా మంచి పేరున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో పలు పార్టీలతో కూటములు కట్టడంపై తరుచుగా విమర్శలు ఎదుర్కొంటుంటారు. 2017లో ఎన్డీయేలో చేరడానికి మహాకూటమిని వీడారు. 2002లో అదే కూటమికి చేరువయ్యారు. తాజాగా ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తొలిసారి 2000 సంవత్సరంలో..
నితీష్ ఇప్పటివరకు ఏడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో తొలిసారి సీఎం అయ్యారు. 2005, 2010, 2015, 2017, 2020తోపాటు తాజాగా 2022లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆయన ఇంతవరకు ఎమ్మెల్యేగా ఎన్నికవలేదు. ప్రజలక సేవ చేయడానికి సభ అయినా, మండలి అయినా ఒకటేననేది నితీష్ అభిప్రాయం.
కూటములు కట్టడంలో ఇంజనీరు
రాజకీయాల్లోకి రాకముందు బీహార్ విద్యుత్తు సంస్థలో ఇంజనీర్గా పనిచేసిన నితీష్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూటములు కట్టడంలో కూడా మంచి ఇంజనీరుగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి పదవి మాత్రం నితీష్కే దక్కుతోంది. 1977లో ఒకసారి హర్నాట్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 1985లో రికార్డుస్థాయి మెజారిటీతో అదే నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయలేదు.
Recommended Video
కేంద్ర మంత్రిగా పనిచేశారు
1989, 1991, 1996, 1998, 1999, 2004 సంవత్సరాల్లో వరుసగా ఆరుసార్లు నితీష్ లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధానమంత్రి అవడానికి కావల్సిన అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జేడీయూ జాతీయాధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం ఆర్జేడీలో ఉన్న శరద్ యాదవ్ కూడా నితీష్కు అన్ని అర్హతలున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.