బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కరోనా పాజిటివ్: హోం ఐసోలేషన్లోకి
పాట్నా: దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఆయన నమూనాలను పరీక్షించగా కరోనా సోకినట్లు తెలింది. దీంతో సీఎం నితీష్ కుమార్ ఐసోలేషన్లో ఉన్నారని సీఎం కార్యాలయం తెలిపింది.
కాగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకుని ఐసోలేషన్లో ఉండాలని కోరారు. కాగా, ఐదు రోజుల క్రితం రాజ్నాథ్ సింగ్.. వాయుసేన అధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఐఏఎఫ్ చీఫ్.. రక్షణ మంత్రి రాజ్నాథ్కు కలిసి నివేదిక సమర్పించారు.
మరో వైపు, కేంద్రమంత్రులు భారతి పవార్, మహేంద్ర నాథ్ పాండే, నిత్యానంద్ రాయ్ లతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తోపాటు బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, వరుణ్ గాంధీ తదితరులు కరోనా బారినపడ్డారు. వీరిలో కొందరు హోంఐసోలేషన్లో ఉండగా, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
కాగా, దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 13.52 లక్షల మంది నమూనాలను పరీక్షించగా.. 1,79,723 మందికి కరోనా సోకినట్లు తేలింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 12.6 వాతం ఎక్కువ కావడం గమనార్హం. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 13.29 శాతానికి పెరిగింది. కాగా, మరో 46,569 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,23,619 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 2.03కి పెరిగింది. గత 24 గంటల్లో 146 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 96.62 శాతంగా ఉంది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. 4033 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1216 ఒమిక్రాన్ కేసులు ఉండగా, రాజస్థాన్ లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1552 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 151.94 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.