దున్నపోతుపై వచ్చి దుమ్మురేపాడు - క్రేజీ కాదు, సెంటిమెంట్ - రాజకీయ చైతన్యంలో బీహార్ ప్రత్యేకత తెలుసా?
పలు రంగాల్లో పేద రాష్ట్రమే అయినప్పటికీ, రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించడంలో బీహార్ది ప్రద్యేక శైలి. బీఆర్ అంబేద్కర్ తదనంతరం సామాజిక ఉద్యమాలకు ఊపిరిగా ఉంటూ.. రాంమనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ లాంటి నేతల్ని అక్కున చేర్చుకోవడం.. స్వాతంత్ర్యం తరువాత 30 ఏళ్లకే కాంగ్రెస్ కోటను కూల్చడం.. ఇప్పటిదాకా బీజేపీ సొంతగా గెలవలేని ఏకైక ఉత్తరాది రాష్ట్రంగా ఉండటం.. నేటికీ 'ముఖ్య'పీఠంపై కూర్చునేది వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తులే కావడం.. లాంటి ఎన్నో అంశాలు బీహారీల రాజకీయ చైతన్యానికి నిదర్శనాలుగా నిలుస్తాయి. ఈ క్రమంలోనే..
బీజేపీ అనూహ్య ఎత్తుగడ: జేడీయూతో 50:50 డీల్ - పాశ్వాన్ ఒంటరి పోరు - నితీశ్ వ్యతిరేక ఓట్లను చీల్చేలా
బీసీ ఐడెంటిటీ..
పెత్తందారీ కులాలను ధీటుగా ఎదురుకుంటూ, బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని చేపట్టిన తొలి రాష్ట్రం కూడా దాదాపు బీహారే. లోహియా, జేపీ వారసులుగా తర్వాతి కాలంలో ముఖ్యపదవులు చేపట్టిన నేతలంతా తమ బీసీ ఐడెంటిటీని ఎక్కడా దాచుకోలేదు సరికదా, దాన్ని మరింతగా పాపులర్ చేశారు. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో మగ గేదెపై ఊరేగుతూ వచ్చి, నామినేషన్ దాఖలు చేసి, నాటి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలుపొందారు. లాలూను ఫాలో అవుతూ ఇప్పుడు మరో వ్యక్తి దున్నపోతుపై వచ్చి మీడియాలో దుమ్మురేపుతున్నాడు..
దున్నపోతుపై ఊరేగింపు..
కరోనా విలయం నేపథ్యంలో తొలిసారిగా ఎన్నెన్నో ప్రత్యేకతలతో జరుగుతున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. మూడు దశల పోలింగ్ లో భాగంగా, తొలి దశ 71 స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ఈనెల 8న(గురువారం) ముగియనుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. పట్నా జిల్లాలోని పాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా(డెమోక్రటిక్) తరఫున పోటీ చేస్తోన్న రవీంద్ర ప్రసాద్ అలియాస్ కపిల్ యాదవ్ బుధవారం దున్నపోతుపై ఊరేగుతూ వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. సదరు వీడియో నెట్టింట వైరల్ కావడంతో తన గెలుపుపై ధీమా పెరిగిందని చెబుతున్నాడతను.
మహిషాసురుడి వారసులం..
ఎన్నికల నామినేషన్ కోసం తాను దున్నపోతుపై రావడం క్రేజీ కోసం చేసింది కాదని, పురాణాల్లోని మహిషాసురుడికి తాము వారసులం కాబట్టే, పూర్వీకులను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో దున్నపై ఊరేగానని రవీంద్ర ప్రసాద్ అలియాస్ కపిల్ యాదవ్ చెప్పుకొచ్చాడు. గతంలో లాలూ యాదవ్ మగ గేదెపై ఊరేగి సీఎం అయ్యారని, ఇప్పుడు తాను కూడా ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు నిజాయితీగా మంచి చేసి పెడతానని ఆయన హామీ ఇస్తున్నారు.
Recommended Video
పాలిగంజ్ లో ఆసక్తికర పోరు...
పాట్నా జిల్లా పాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికర పోరు నెలకొంది. జనరల్ స్థానం అయినప్పటికీ, ఇక్కడ యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో 90ల తర్వాత లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ ఇక్కడ బలమైన ప్రభావం చూపుతూ వస్తున్నది. 2015 ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి గెలుపొందిన జయవర్ధన్ యాదవ్.. కొద్ది రోజుల కిందటే జేడీయూలోకి జంప్ అయ్యి.. ఇప్పుడు జేడీయూ టికెట్ పై పోటీకి నిలబడ్డారు. యూపీ కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా పాలిగంజ్ సీటును ఈసారి సీపీఐ ఎంఎల్ పార్టీకి కేటాయించారు. విద్యార్థి నేత సంజీవ్ సౌరవ్ ను ఎంఎల్ పార్టీ బరిలో నిలిపింది. నితీశ్ వ్యతిరేక ఓట్లను కొల్లగొట్టడమే ధ్యేయంగా జేడీయూ పోటీ చేస్తోన్న అన్ని స్థానాల్లో ఎల్జేపీ(పాశ్వాన్ పార్టీ) క్యాండేట్లను నిలబెట్టింది. దున్నపోతుపై వచ్చి నామినేషన్ వేసిన రవీంద్ర ప్రసాద్ సహా పదుల సంఖ్యలో ఇండిపెండెట్లు బరిలో నిలిచారు. ఓట్లు చీలిపోతే అప్పుడు విజయం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది.