Bihar Results: ఊహించనివిధంగా బీజేపీ వైపు బీహార్ ప్రజలు, ఆర్జేడీని నమ్మలేదా?
పాట్నా: బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకే మొగ్గు చూపుతుండటంతో ఆర్జేడీ మహాకూటమిలో కొంత నిరాశ నెలకొంది. అయితే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ తొలుత ఆధిక్యతను చాటినప్పటికీ.. ప్రస్తుతం ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video

ఆర్జేడీ హామీలను నమ్మలేదా?
ఆర్జేడీ మహాకూటమి ఇచ్చిన 10 లక్షల ఉద్యోగాల కల్పన హామీ, 15ఏళ్ల నితీష్ కుమార్ పాలనపై అసంతృప్తి కూడా ఓటర్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేదని ఈ ఫలితాల ద్వారా తెలుస్తోంది. అంతేగాక, సివన్, గోపాల్గంజ్, మహారాజ్గంజ్, భోజ్పూర్ ప్రాంతంలో ఆర్జేడీకి పట్టున్నప్పటికీ.. ఆ స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి ఆధిక్యతను చాటుకుంటోంది. తేజశ్వి యాదవ్ సభలకు భారీగా జనం వచ్చినప్పటికీ.. ఓటర్లను ఆకర్షించడంలో మాత్రం ఆ స్థాయిలో లేదని తెలుస్తోంది. అయితే, ఈ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో 60శాతం ప్రజలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

ఆర్జేడీ వర్సెస్ బీజేపీగా..
144 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీకి 80-90 సీట్లు వస్తాయని అంచనా వేసినప్పటికీ ఆ స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం లేనట్లుగానే తెలుస్తోంది. కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేయగా ఆ పార్టీకి సగం సీట్లు వస్తాయా? అనేది సందేహంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ మహాకూటమి వైపునకు ఓటర్లు మొగ్గుచూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్జేడీ వర్సెస్ బీజేపీగా ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. అయితే, బీజేపీ అనుకున్నదానికంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుంటుండటం గమనార్హం.

కీలక ప్రాంతాల్లో బీజేపీ హవా..
భోజ్పూర్ ప్రాంతంలోని 46 స్థానాల్లో ఆర్జేడీ 16 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా, 12 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. వామపక్ష పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో కొంతమేర పుంజుకుంటున్నట్లు కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో 54 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతుండగా, 53 స్థానాల్లో ఆర్జేడీ ముందంజలో ఉంది. ఇక సెమీ అర్బన్ స్థానాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుండగా, ఆర్జేడీ ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది. ఎస్సీలకు కేటాయించిన సీట్లలోనూ బీజేపీనే ఆధిక్యతను చాటుకుంది. 11 స్థానాల్లో బీజేపీ ముందుండగా, 9 స్థానాల్లో ఆర్జేడీ ఆధిక్యతను చాటుకుంటోంది.

ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లోనూ బీజేపీదే ఆధిక్యం..
ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చంపారన్, సీమాంచల్ ప్రాంతాల్లో కూడా బీజేపీ తన హవాను కొనసాగించింది. కోసి, మిథిలా, తిర్హుట్ ప్రాంతాల్లోని 41 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను చూపుతుండగా, 32 స్థానాల్లో జేడీయూ, ఆర్జేడీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాని ఈ ప్రాంతంలో ర్యాలీలు నిర్వహించడం బీజేపీకి కలిసివచ్చినట్లు తెలుస్తోంది. జై శ్రీరామ్ అని కొంత మందికి నచ్చడం లేదంటూ ఆయన ర్యాలీల సందర్భంగా వ్యాఖ్యానించారు. జనరల్ కేటగిరిలోని 203 స్థానాల్లో బీజేపీ 60 స్థానాల్లో లీడింగ్లో ఉంది. 50 స్థానాల్లో ఆర్జేడీ, జేడీయూ 42 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. 98 స్థానాల్లో మహిళలు పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమి నుంచి 44 మంది ఆధిక్యంలో ఉండగా, ఆర్జేడీ మహాకూటమి నుంచి 39 మంది అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. నిరుద్యోగం, పేదరికం లాంటి అంశాలు ఎన్డీఏ పాలనపై ప్రభావం చూపలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications