సిఎంను, ఆయనెవరు: షిండేపై కేజ్రీ, సామాన్యుడవికాదు
న్యూఢిల్లీ: తాను ఢిల్లీ ముఖ్యమంత్రినని, తాను ఎక్కడ కూర్చోవాలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ చెప్పాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం అన్నారు. ఢిల్లీ పోలీసుల వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్, ఆయన పార్టీ చేస్తున్న దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.
త్వరలో గణతంత్ర దినోత్సవం ఉన్నందున కేజ్రీవాల్ ధర్నా వేదికను మార్చుకోవాలని షిండే సూచించగా.. కేజ్రీవాల్ పై విధంగా స్పందించారు. వారి ధర్నా రైల్ భవన్ వద్ద రెండోరోజు కొనసాగుతోంది. ధర్నా దృష్ట్యా ఈ రోజుకూడా నాలుగు మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ సమావేశం దీక్షాస్థలి వద్దే నిర్వహించాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారట.
రైల్ భవన్ మార్గంలో రహదారులపై ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాటిని తొలగించేందుకు కేజ్రీవాల్, ఎఎపి కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంత్రుల ఆదేశాలను పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేయాల్సిందేనని కేజ్రీవాల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే తాను నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
ధర్నా ప్రాంతంలో టాయిలెట్ మొబైల్ ఏర్పాటు చేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లను తీర్చకుంటే తాము ఈ నెల 26న రాష్ట్రపతి రోడ్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బిజెపి నేతలు మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ సహా ఇతర నేతలు రాత్రంతా ధర్నా కేంద్రం వద్దే నిద్రించారు. మరోవైపు, మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత కాంగ్రెసు పార్టీ కుట్ర అని ఎఎపి నేత, రవాణాశాఖ మంత్రి సౌరబ్ భరద్వాజ్ ఆరోపించారు.
సామాన్యుడిలా వద్దు: సోలీ సొరాబ్జీ
అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అని ఆయన సామాన్యుడిలా ప్రవర్తించవద్దని సోలీ సోరాబ్జి హితవు పలికారు. చట్టానికి ఎవరు అతీతంగా ప్రవర్తించలేరన్నారు. చట్టం కన్నా గొప్పవాళ్లు ఎవరు లేరన్నారు. అరాచకవాదిలా కేజ్రీవాల్ ప్రవర్తిస్తే.. వారిపట్ల చట్టం ఎలా ఉంటుందో ఆయన పట్ల అలాగే ఉంటుందన్నారు. మరోవైపు కేజ్రీవాల్ పైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది.