ముప్పును గ్రహించిన బిజెపి: టీ బిల్లుకు మద్దతు
హైదరాబాద్: తెలంగాణ బిల్లును వ్యతిరేకించడం వల్ల సంభవించే ముప్పును బిజెపి అగ్రనాయకత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో బేషరతు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో సోమవారం వార్తలు వచ్చాయి. ఆదివారం రాత్రి బిజెపి అగ్రనేతలు బిల్లును వ్యతిరేకించడం వల్ల కలిగే లాభాన్ని, నష్టాన్ని బేరీజు వేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బిల్లును వ్యతిరేకించడం వల్ల సీమాంధ్రలో ప్రయోజనం పొందాలని చూడడం తప్పిదమే అవుతుందని భావించినట్లు చెబుతున్నారు. బిల్లును సమర్థించడం వల్ల తెలంగాణలో తమకు ప్రయోజనం కలుగుతుందనే భావనతో వారున్నట్లు చెబుతున్నారు. బిల్లును వ్యతిరికిస్తే కాంగ్రెసు తమపై నిందలు వేసి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి తమ అవకాశాలను పూర్తిగా దెబ్బ తీసే ప్రమాదం ఉందని వారు అంచనాకు వచ్చినట్లు జాతీయ మీడియా వ్యాఖ్యానించింది.

తెలంగాణ బిల్లుకు బేషరతుగా మద్దకు ఇవ్వడానికి తమ నాయకత్వం సిద్ధపడిందని, ఉమ్మడి రాజధానిపై గానీ గవర్నర్కు హైదరాబాద్పై కల్పించే అధికారాలపై గానీ రాజ్యాంగ సవరణలకు పట్టుబట్టబోదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీమాంధ్రకు తగిన న్యాయం చేస్తామని, అవసరమైతే అందుకు రాజ్యాంగానికి సవరణలు తెస్తామని ఆయన అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. కరీంనగర్, వరగంల్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో, హైదరాబాదులో తమ పార్టీ ఎలా బలం పుంజుకుందో తెలంగాణ పార్టీ నాయకులు వివరించిన తర్వాత పార్టీ అగ్ర నాయకత్వం తన వైఖరిని మార్చుకున్నట్లు చెబుతున్నారు.
గత కొద్ది రోజులుగా బిజెపి వైఖరి వల్ల తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే పరిస్థితి లేదనే భావన పెరుగుతూ వచ్చింది. కాంగ్రెసు తన సభ్యులనే నియంత్రించుకోలేని స్థితిలో ఉందని, అటువంటి స్థితిలో తెలంగాణ బిల్లును ఆమోదించలేమని బిజెపి అగ్ర నాయకులు చెబుతూ వచ్చారు.
తెలంగాణ బిల్లుపై కాంగ్రెసు నాటకాలాడుతూ తమను నిందించాలని చూస్తోందని, తాము స్పష్టంగా ఉన్నామని, తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూస్తామని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. బిజెపి నాటకాలు ఆడుతోందని, పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై ఎప్పుడు చర్చను చేపడుతారో స్పష్టం చేయడం లేదని ఆయన విమర్సించారు.
తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టినట్లా, లేదా అనే విషయాన్ని స్పీకర్ మీరా కుమార్ స్పష్టం చేయడం లేదని, లోకసభ ఎజెండా గురించి తమకు తెలిపే కనీస మర్యాదను కూడా ప్రభుత్వం పాటించడం లేదని మురళీధర్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications