సీఎం యోగి ఆదిత్యనాథ్ కోసం సీటు వదులకున్న ఎమ్మెల్యేకు అఖిలేష్ యాదవ్ ఆఫర్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ (అర్బన్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాధామోహన్ అగర్వాల్ సీఎం కోసం తన సీటును వదులుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆ ఎమ్మెల్యేకు అదే స్థానం నుంచి టికెట్ ఆఫర్ చేశారు.
బిజెపికి చెందిన గోరఖ్పూర్ (అర్బన్) ఎమ్మెల్యే అగర్వాల్ గురించి అడిగిన ప్రశ్నకు.. సమాజ్వాదీ పార్టీ చీఫ్ లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. "మీరు (రిపోర్టర్లు) అతనితో సంబంధాలు ఏర్పరచుకుని, అతనితో మాట్లాడగలిగితే, టిక్కెట్ ప్రకటించబడుతుంది, అతనికి టిక్కెట్ వస్తుంది' అని అన్నారు. 'అన్న సంకల్ప్ దివస్' సందర్భంగా యాదవ్ ఇక్కడి తన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాధామోహన్ అగర్వాల్ 2002 నుంచి గోరఖ్పూర్ అర్బన్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 'ముఖ్యమంత్రి (యోగి ఆదిత్యనాథ్) ప్రమాణ స్వీకారోత్సవం నాకు గుర్తుంది. ఈ సందర్భంగా నేను రాధామోహన్ అగర్వాల్ని చూశాను. ఆయనకు సీటు దొరక్క నిలబడాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వంలో ఆయన అత్యంత అవమానానికి గురయ్యారు' అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యేల గురించి అడిగిన ప్రశ్నకు.. అఖిలేష్ యాదవ్ ఇంతకుముందు స్పందిస్తూ.. 'తాము అందరికీ సీట్లు ఇవ్వలేము. బీజేపీ దాని టిక్కెట్లను పంపిణీ చేయగలదు. మేము ఇప్పుడు ఎవరినీ (ఎస్పీలోకి) తీసుకోలేము' అని చెప్పారు. కానీ, అగర్వాల్ పేరు చెప్పగానే టికెట్ ఇస్తానని చెప్పడం గమనార్హం.
తన తమ్ముడి భార్య అపర్ణా యాదవ్ బీజేపీలో చేరడంపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసిన అఖిలేష్ యాదవ్.. 'బీజేపీకి నా కంటే నా కుటుంబంపైనే ఎక్కువ శ్రద్ధ.. బీజేపీ నుంచి స్ఫూర్తి పొంది మీరు ఆ ప్రశ్న అడుగుతున్నారా? అని అఖిలేష్ అన్నారు. కాగా, అపర్ణా యాదవ్ 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నుంచి ఎస్పీ టికెట్పై పోటీ చేసి బీజేపీకి చెందిన రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు.
ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావణ్పై అడిగిన ప్రశ్నకు ఎస్పీ అధినేత స్పందిస్తూ.. కూటమి ప్రజలకు ఎస్పీ గౌరవం ఇచ్చిందని, కూటమిని సుస్థిరం చేసేందుకు త్యాగం చేసింది అని చెప్పారు. "ఎస్పీ త్యాగాలు చేస్తోంది. చంద్రశేఖర్ (రావణ్) విషయానికొస్తే, నేను అతనికి సీట్లు ఇచ్చాను. అతను ఒక సోదరుడిగా సహాయం చేయాలనుకుంటే, అతను అలా చేయగలడు' అఖిలేష్ యాదవ్ తెలిపారు.
కాగా, ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి. ఉత్తరప్రదేశ్ తోపాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.