40 నిమిషాలు లిఫ్ట్లో చిక్కుకున్న అమిత్ షా
పాట్నా: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఆయనను సీఆర్ పీఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. 40 నిమిషాల పాటు అమిత్ షా లిఫ్ట్ లో గడిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సీట్ల సర్దుబాటు విషయంపై చర్చించడానికి అమిత్ షా గురువారం పాట్నా వచ్చారు. రాజ్ భవన్ సమీపంలోని బీహార్ ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశారు. పార్టీ నాయకులతో సుధీర్ఘంగా చర్చించారు.
రాత్రి 11.30 గంటల సమయంలో అమిత్ షా, ఆయన వ్యక్తిగత కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడు భూపీందర్ సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి సాధన్ సింగ్, భద్రతా సిబ్బంది లిఫ్ట్ లో బయలుదేరారు. లిఫ్ట్ ఒక్క సారిగా నిలిచిపోయింది.
వారి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లు పనిచెయ్యలేదు. లిఫ్ట్ లో ఉన్న ఎమర్జెన్సీ నంబర్ కు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. సుమారు 40 నిమిషాల పాటు అందరూ లిఫ్ట్ లోనే ఇరుక్కున్నారు. తరువాత అమిత్ షా ఆదేశాల మేరకు సీఆర్ పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.
లిఫ్ట్ ఇనుప డోర్ లు పగలగొట్టారు. తరువాత అమిత్ షాను క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు. లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది, ఎమర్జెన్సీ నంబర్ కు ఫోన్ చేసినా ఎందుకు ఎవ్వరు స్పందించలేదు అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.