కూడల సంఘమ ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా, అక్కడకు వెళ్లలేదు
బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం హునగుంద నుంచి సంఘసంస్కర్త బసవేశ్వరుడు లింగైక్యమైన అలమట్టి జలాశయ సమీప కూడల సంఘమపుణ్య క్షేత్రాన్ని దర్శించుకున్నారు. సంగమేశ్వరుడికి అర్చన చేశారు.
అయితే సమీపంలోని బసవన్న గుడికి వెళ్లలేదు. సమీపంలోని ప్రముఖ లింగాయత్ ఇనిస్టిట్యూషన్స్కు వెళ్లకపోవడానికి కారణం ఉందని అంటున్నారు. కొందరు లింగాయత్ గురువులు ప్రత్యేక మతం గురించి విజ్ఞాపన పత్రాలు ఇస్తారేమోనని వెళ్లకపోయి ఉంటారని అంటున్నారు.
కాగా, కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వ పతనానికి లెక్కింపు ఆరంభమైందని అమిత్ షా అన్నారు. బాగలకోట జిల్లా హునగుంద పట్టణంలో శనివారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటం ఖాయమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 12 రాష్ట్రాల్లో జెండా ఎగరవేశామన్నారు. కర్ణాటకలోనూ బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపైనే కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువగా ఆధారపడిందని, అలాంటి సిద్ధరామయ్య అనివార్యంగా బాదామిలో కూడా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అక్కడా ఆయనకు పరాభవం తప్పదన్నారు.