నరేంద్ర టాండన్ రాజీనామా: ఉపసంహరణ, వివాదంపై క్షమాపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ ఎన్నికల క్యాంపెయిన్ ఇన్ ఛార్జి నరేంద్ర టాండన్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. తన రాజీనామా సృష్టించిన వివాదానికి కూడా టాండన్ క్షమాపణ చెప్పారు.
అయితే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉపసంహరించుకోవడం విశేషం. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ ఎన్నికల క్యాంపెయిన్ ఇన్ ఛార్జి నరేంద్ర టాండన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ కిరణ్ బేడీని ఓ నియంతగా అభివర్ణించారు. బీజేపీ కార్యకర్తల పట్ల ఆమె నియంతృత్వ మార్గాన్ని తట్టుకోలేక తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కిరణ్ బేడీ సన్నిహితులు ప్రతి విషయంలోనూ తనని అవమానించే విధంగా మాట్లాడారని తెలిపారు.
రాజీనామాను పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆమోదించక పోవడంతోటే తిరిగి మళ్లీ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 7న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10న ఫలితాలు వెల్లడించనున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే పోరు ఎక్కువగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేసులో ఉండగా, బీజేపీ అనూహ్యాంగా మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడీని సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 70 నియోజక వర్గాలకు గాను 673 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వీరిలో 63 మంది మహిళా అభ్యర్ధులు ఉన్నారు. బీజేపీ 69, ఆప్ 70, కాంగ్రెస్ 70, బీఎస్పీ 70 స్ధానాలకు తమ అభ్యర్ధులను బరిలో నిలిపారు.
ఎన్సీపీ నుంచి 9, సీపీఐ నుంచి 5, సీపీఎం నుంచి 3 బరిలో ఉన్నారు. 377 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. బురారి నియోజక వర్గం నుంచి అత్యధికంగా 18 మంది, అంబేత్కర్ నగర్ నుంచి అత్యల్పంగా నలుగురు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.
ఫిబ్రవరి 7న జరగనున్న ఎన్నికల పోలింగ్ కోసం 12,083 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,33,14,215 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోకున్నారు.












Click it and Unblock the Notifications