తల్లీ తనయులకు ఎసరు: అమేథీ, రాయబరేలీపై బీజేపీ నజర్
2019 లోక్ సభ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్నది.
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై 27 ఏళ్లు దాటినా.. అమేథీ, రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గాలు మాత్రం గాంధీ - నెహ్రూ కుటుంబ వారసులకు కంచుకోటలుగా మిగిలాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో నెహ్రూ రాజకీయ వారసులకు తిరుగులేదు.
తొలి లోక్సభ ఎన్నికల నుంచి 2014 ఎన్నికల వరకూ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేస్తూ వస్తోంది. మధ్యలో కేవలం రెండు సార్లు మాత్రమే జనతాపార్టీ నుంచి రవీంద్ర ప్రతాప్ సింగ్ (1977), భారతీయ జనతాపార్టీ (1998) డాక్టర్ సంజయ్ సింగ్ విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నియోజకవర్గంలో గెలుపొందితే.. అమేథీలోనే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరువైందని, ఆ నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకోని రాహుల్ గాంధీ దేశాభ్యున్నతి కోసం ఏం చేస్తారని ఎదురు దాడి చేయాలని కమలనాథులు తలపోస్తున్నారు. ఇంతకూ అమేథీలో గెలుపు సాధిస్తుందా? భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ సారథిగా భావిస్తున్న రాహుల్ గాంధీకి కమలనాథులు ముచ్చెమటలు పట్టించే అవకాశాలు ఉన్నాయా? ఒకసారి అమేథీ, రాయబరేలీ నియోజకవర్గ విశేషాలు పరిశీలిద్దాం...

రెండు సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓటమి
అమేథీ లోక్ సభా నియోజకవర్గాన్ని 1967లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ఈ నియోజకవర్గం నెహ్రూ - గాంధీ కుటుంబానికి కంచుకోటలా నిలిచింది. మొత్తం 15 లోక్సభ ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకతతో 1977లో ఒకసారి. అటల్ బిహారీ వాజ్పేయి మీదున్న సానుభూతితో.. మరోసారి కాంగ్రెస్ ఇక్కడ ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ తొమ్మిది సార్లు నెహ్రూ - గాంధీ వారసులు విజయం సాధించారు. ఇక్కడ నుంచి సంజయ్ గాంధీ 1980లో తొలిసారి గెలిచారు.

రాహుల్ గాంధీ హ్యాట్రిక్ గెలుపు ఇలా
రాజీవ్ గాంధీ వరుసగా 1981, 1984, 1989, 1991లో గెలుపొందారు. 1999లో సోనియా గాంధీ విజయం సాధించారు. రాహుల్ గాంధీ 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్ సాధించారు.
అమేథీలో నెహ్రూ వారసులు భారీ ఓట్ల తేడాతో గతంలో విజయాలు సాధించారు. ప్రధానంగా 1980లో 1.29 లక్షల, 1981లో 2.38, 1984లో 3.15, 1999లో మూడు లక్షల ఓట్ల తేడాతో భారీ విజయాలను నమోదు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేవలం 1.08 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. నెహ్రూ వారసుల్లో అతి తక్కువ ఓట్లతో విజయం సాధించడం ఇదే ప్రథమం.

సోనియా వరుసగా నాలుగు సార్లు విజయం
ఇక రాయ్బరేలీ విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. 1951లో ఏర్పాటైన ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకూ 19 లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇందులో కేవలం మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇక్కడ నుంచి ఫిరోజ్ గాంధీ 1951, 1957 ఎన్నికల్లో విజయం సాధించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980 ఎన్నికల్లో గెలుపొందారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి చెందిన అరుణ్ నెహ్రూ వరుసగా 1980, 1984 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడ నుంచి 2004, 2006, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

సోనియా సీటుకు ఎసరు...
ఉత్తరప్రదేశ్ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు అమేథీ, రాయ్బరేలీ మాత్రమే. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ రెండింటిలో దేన్నయినా సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అమేథీ, రాయ్బరేల్లో ఒక్కసీటును సాధించినా దేశంలో నెహ్రూ - గాంధీ కుటుంబ పాలనకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేయవచ్చన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నారు.












Click it and Unblock the Notifications