నితీష్ భేష్ కానీ, ఓటు మోడీకే: ఢిల్లీలోనే కేజ్రీవాల్ హవా
న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికలలో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వైపే బీహారీలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యమంత్రి, జెడి(యు) నేత నితీష్ కుమార్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు ప్రధానిగా మాత్రం మోడీకి ఓటేస్తామంటున్నారు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ (సిఎస్డిఎస్)తో కలిసి సిఎస్ఎస్ ఐబిఎన్ చేసిన సర్వే ప్రకారం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా నాలుగు శాతం ఓట్లు సాధిస్తుంది. ఢిల్లీలో మాత్రం 48 శాతం ఓట్లు వస్తాయి.
బీహార్లో బిజెపి, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసు, ఒడిశాలో బిజెడిలు లోకసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కైవసం చేసుకోనున్నాయి. సర్వే ప్రకారం ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టిఎంసి ఇరవై నుండి ఇరవై ఎనిమిది, వామపక్షాలు పదమూడు వరకు, కాంగ్రెసు తొమ్మిది వరకు, బిజెపి రెండు వరకు సీట్లు గెలుచుకుంటాయి. మమత పాలన పట్ల సగం కంటే ఎక్కువ మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారు. ప్రధానిగా మాత్రం ఎక్కువ మంది మోడీనే కోరుకుంటున్నారు.
బీహార్లో బిజెపికి 16-24, జెడి(యు)కు 7-1, ఆర్జేడికి 6-10, కాంగ్రెసుకు నాలుగు సీట్ల వరకు వస్తాయి. సగం కంటే ఎక్కువ మంది నితీష్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు మరోసారి అవకాశం ఇస్తామన్నారు. ప్రధానిగా మాత్రం మోడీకే పట్టం గట్టారు.
ఒడిశాలో అధికార బిజెడి 10-16 సీట్లు, కాంగ్రెసు 3-9 సీట్లు గెలుచుకుంటింది. బిజెపి నాలుగు సీట్ల వరకు గెలుచుకునే అవకాశముంది. డెబ్బై శాతం మంది ప్రజలు నవీన్ పట్నాయక్ పాలన పట్ల సంతృప్తితో ఉన్నారు.