యడ్డియూరప్ప ప్రమాణం..నాలుగోస్సారి! ఈ సారైనా కుదురుకునేనా?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్డియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం సాయంత్రం 6:32 నిమిషాలకు బెంగళూరులోని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. గవర్నర్ వజూభాయ్ వాలా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దైవ సాక్షిగా యడ్డియూరప్ప ప్రమాణం చేశారు. తొలిదశలో ఆయన ఒక్కరే. అనంతరం శ్రావణమాసం ఆరంభమైన అనంతరం మంత్రివర్గాన్ని విస్తరిస్తారని తెలుస్తోంది. కర్ణాటకలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇది నాలుగోసారి అవుతుంది. దక్షిణాదిన ఇప్పటిదాకా ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.
ప్రభుత్వాన్ని కూల్చేసి..కాలినడకన తిరుమలకు కర్ణాటక తిరుగుబాటు ఎమ్మెల్యే!
మాజీలు గైర్హాజర్..ఎస్ఎం కృష్ణ ఒక్కరే హాజర్
ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు, మాజీ మంత్రులు, పలువురు నాయకులు హాజరయ్యారు. తాజా మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గైర్హాజరు అయ్యారు. కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగి, ఆ తరువాత కాషాయ కండువాను కప్పుకొన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఈ కార్యక్రామనికి హాజరయ్యారు. యడ్డియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగో సారి. ఇప్పటిదాకా మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఏ ఒక్కసారి కూడా అయిదేళ్ల పాటు పదవీకాలాన్ని అనుభవించలేకపోయారు. గరిష్ఠంగా 3 సంవత్సరాల 66 రోజులు ఆయన పదవిలో కొనసాగగలిగారు.
ప్రత్యేక ఆకర్షణగా శోభా కరంద్లాజే
యడ్డియూరప్ప తనదైన శైలిలో ఆకుపచ్చని శాలువాను మెడలో వేసుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లోక్సభ సభ్యురాలు శోభా కరంద్లాజే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్భవన్కు వచ్చిన యడ్డియూరప్పను పలువురు నాయకులు పాదనమస్కారం చేయడం కనిపించింది. కేంద్రమంత్రి, దివంగత అనంత కుమార్ తనయుడు, లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య.. యడ్యూరప్ప, ఎస్ఎం కృష్ణలకు పాదనమస్కారం చేశారు.
మూడు వేల పాసులు, భారీ స్క్రీన్
ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన బెంగళూరు మల్లేశ్వరలోని కాడు మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లారు. మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే బీజేపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు బయలుదేరి వచ్చారు. యడ్డియూరప్ప ప్రమాణ స్వీకారం కోసం బెంగళూరు నగర పోలీసులు మూడు వేల పాసులను జారీ చేశారు. కార్యకర్తల సౌకర్యం కోసం రాజ్భవన వెలుపల భారీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు.
మూడుసార్లు..అయినా
2007లో తొలిసారిగా దక్షిణాదిన కమలం వికసించింది. 2007 నవంబర్ 12వ తేదీన యడ్డియూరప్ప తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఆయన పదవిలో కొనసాగారు. కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ (ఎస్) బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఫలితంగా.. వారంరోజుల్లోనే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఏడు నెలల పాటు కర్ణాటకలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. 2008 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. యడ్డియూరప్ప రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2008 మే నుంచి 2011 ఆగస్టు వరకు పదవిలో కొనసాగారు. గత ఏడాది కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ముందు కూడా యడ్డియూరప్పే ముఖ్యమంత్రి. గత ఏడాది మే 17వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం మైనారిటీలో ఉండటం వల్ల ఆరు రోజుల్లోనే రాజీనామా చేశారు. ఇది నాలుగోసారి. ఈ సారైనా ఆయన కుదురుగా ఉంటారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.