పాక్ బలగాల దుశ్చర్య: భారత జవాను గొంతుకోశారు..కనుగుడ్లు పీకేసి దూరంగా విసిరేశారు
Recommended Video
జమ్మూ/ ఢిల్లీ: పాకిస్తాన్ మరో దారుణానికి ఒడిగట్టింది. భారత్కు చెందిన బీఎస్ఎఫ్ జవాను గొంతు కోసి అతని కనుగుడ్లు తీసేసి జమ్మూ వద్ద అంతర్జాతీయ సరిహద్దు దగ్గర పడేసింది. ఈ దుశ్చర్యకు పాల్పడింది పాక్ సైనికులు. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన రామ్గర్ సెక్టార్లో మంగళవారం చోటుచేసుకుంది. దీంతో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. అంతేకాదు ఈ దారుణానికి పాల్పడ్డ పాక్ జవాన్లపై ఆదేశ ప్రభుత్వానికి భారత్ ఫిర్యాదు చేసింది.
బీఎస్ఎఫ్ జవాను నరేంద్ర కుమార్ గొంతును కోయడమే కాదు.. ఆయనపైకి కాల్పులు కూడా జరిపారు. ఆయన శరీరంలో బుల్లెట్ గాయాలను భారత ఆర్మీ అధికారులు కనుగొన్నారు. నరేంద్ర కుమార్పై జరిగిన దారుణంపై పాక్ అధికారులు స్పందించలేదు. అతని కోసం దాదాపు ఆరుగంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.
అదృశ్యమైన నరేంద్ర కుమార్ కోసం తమతో కలిసి గాలింపు చర్యలు చేపట్టాలని పాక్ ఆర్మీని భారత బలగాలు కోరినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇందుకు వారు ఏవో సాకులు చూపినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే అతి కష్టం మీద రిస్క్ ఆపరేషన్ చేసి భారత జవాన్లు నరేంద్ర కుమార్ మృతదేహాన్ని కనుగొన్నారు.
అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరిగిన ఈ తొలిఘటనపై భారత విదేశాంగ శాఖ, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందేనంటూ పాకిస్తాన్ ఆర్మీని కోరారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద గడ్డి ఎక్కువగా పెరగడంతో దాన్ని తొలగించేందుకు పాట్రోల్ పార్టీ వెళ్లిందని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే జవాను నరేంద్ర కుమార్ అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు.