బీఎస్ఎఫ్ జవాను కాల్పులు: ఇద్దరు సహచరుల మృతి
కోల్కతా: ఓ బీఎస్ఎఫ్ జవాను ఇద్దరు సహచర జవాన్లను కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్పుర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ తర్వాత నిందితుడు అధికారుల వద్ద లొంగిపోయాడు.
ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులోని రాయ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఓ ప్రాంతంలో బీఎస్ఎఫ్ క్యాంపు నడుస్తోంది. ఈ క్యాంపులో 146 బెటాలియన్కు చెందిన ఉత్తమ్ సూత్రధార్ అనే జవాను.. ఇన్స్పెక్టర్ మహిందర్ సింగ్ భట్టి, కానిస్టేబుల్ అనూజ్ కుమార్పై కాల్పులకు తెగబడ్డాడు.
ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఉత్తమ్ తమ కమాండర్ ఎదుట లొంగిపోయినట్లు రాయ్గంజ్ సూపరింటెండెంట్ సుమిత్ కుమార్ తెలిపారు.
ఈ కేసును రాయ్ గంజ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్పీ సుమిత్ వెల్లడించారు. అయితే, ఇద్దరు తోటి జవాన్లను ఉత్తమ్ ఎందుకు కాల్చి చంపాడనే విషయం ఇంకా తెలియరాలేదు.