అలాంటి పరిస్థితే ఎదురైతే.. ముస్లింలకు అండగా నేనుంటా.. ఎవ్వరినైనా ప్రశ్నిస్తా: రజినీకాంత్..!
చెన్నై: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. దక్షిణాది సూపర్స్టార్ రజినీకాంత్ వాటికి మద్దతు పలికారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల గానీ, జాతీయ పౌర నమోదు వల్ల గానీ.. భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం ఉదయం ఆయన చెన్నైలోని తన నివాసం పోయెస్ గార్డెన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ముస్లింలకు సమస్యల ఉండవని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసిందని అన్నారు. ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసిన తరువాత.. ముస్లింలు కష్టనష్టాలకు గురయ్యే పరిస్థితే గనక ఏర్పడితే.. తాను వారికి అండగా నిల్చుంటానని, ఎవ్వరినైనా ప్రశ్నిస్తానని అన్నారు. ఈ చట్టం వల్ల ముస్లింలు ఏ విధంగా భారత పౌరసత్వాన్ని కోల్పోతారని రజినీకాంత్ విలేకరులకు ఎదురు ప్రశ్న వేశారు.

భారత గడ్డ పట్ల ముస్లింలకు ప్రేమానురాగాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భారత్పై మమకారం ఉండటం వల్లే దేశ విభజన సమయంలో కూడా వారు పాకిస్తాన్కు వెళ్లలేదని, మనదేశంలో నివసించడానికే మొగ్గు చూపారని అన్నారు. అలాంటి ముస్లింలను పౌరసత్వ సవరణ చట్టం మనదేశం నుంచి ఎలా వేరు చేయగలదని చెప్పారు. స్వదేశాన్ని విడిచి పెట్టి వెళ్లడానికి ఏ ముస్లిం కూడా సిద్ధంగా లేడని, ఇక్కడే పుట్టి, ఇక్కడే మరణించాలని కోరుకుంటున్నారని అన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ముస్లింలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. అలాంటి పార్టీల మాయలో పడొద్దని చెప్పారు. కొంతమంది మత పెద్దలు కూడా అలాంటి రాజకీయ పార్టీల మాటలు వింటున్నారని, అలా చేయడం సరికాదని రజినీకాంత్ అన్నారు. 30 సంవత్సరాలుగా భారత్లో తలదాచుకుంటూ వస్తోన్న శ్రీలంకకు చెందిన తమిళ శరణార్థులకు ద్విపౌరసత్వాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications