బీహార్ గ్రామంలో ఒక్క రాత్రి గడపగలరా?.. రాహుల్కు ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్
Prashant Kishor: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. బీహార్ పట్ల రాహుల్ గాంధీ నిబద్ధతను ప్రశ్నిస్తూ నిజమైన రాజకీయ ప్రమేయం కంటే ఆయన కేవలం ప్రతీకాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీహార్ అంతటా పాదయాత్రలో భాగంగా అలసిపోకుండా నడుస్తున్న ప్రశాంత్ కిషోర్.. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీహార్ గ్రామీణ ప్రాంతాలతో తన అనుబంధాన్ని నిరూపించుకోవడానికి రాహుల్ గాంధీ కనీసం ఒక రాత్రి అయినా బీహార్లోని గ్రామంలో గడపాలని ఛాలెంజ్ విసిరారు.
రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారని.. కానీ నిజంగా ఎలాంటి యాత్రనూ చేపట్టరని ప్రశాంత్ కిషోర్ అన్నారు. రాహుల్ ఏనాడైనా బీహార్లోని ఒక గ్రామంలో ఒక్క రాత్రయినా గడిపారా అంటూ ప్రశ్నించారు. ఆయన ఒక్క రాత్రి అయినా గ్రామంలో గడపగలిగితే తాము అంగీకరిస్తామని ఆయన అన్నారు. ఢిల్లీలో కూర్చుని బీహారీలను చూసి నవ్వుతారని.. ఆపై ఇక్కడికి ఇచ్చి మాటలు చెబుతారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహారీ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ను బీహార్ ప్రజల పట్ల సంవత్సరాల నిర్లక్ష్యం, అగౌరవం అంటూ అభివర్ణించారు."మీరు బీహారీలు కూలీ పనులు చేయడానికి పుట్టారని అంటారు, ఆపై ఇక్కడకు వచ్చి మాకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారా?" అని ఆయన తేల్చి చెప్పారు. అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1989లో బీహార్ను అభివృద్ధి కేంద్రంగ8ా మారుస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. "ఆ డబ్బు ఎక్కడికి పోయింది? ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోనే ఉంది. బీహార్ కోసం మీరు ఏం చేశారు?" అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు.
సిక్కులకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పినట్లయితే, బీహార్లో ప్రచారం చేయడానికి ముందు రాహుల్ గాంధీ బీహారీలకు కూడా క్షమాపణలు చెప్పాలని ప్రశాంత్ కిషోర్ అన్నారు. "బీహారీలు కేవలం శ్రమ కోసమే పుట్టినట్లయితే, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? తెలంగాణలో ప్రచారం చేసుకోండి. అక్కడ మీ ఓట్లను పొందండి," అని కిషోర్ అన్నారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని అడిగినప్పుడు, "లాలూ జీ దయాదాక్షిణ్యాలపై" ఆధారపడి ఉంటుందని కిషోర్ అన్నారు. హార్ ఎన్నికలు ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే అవకాశం ఉంది. అయితే భారత ఎన్నికల సంఘం (ECI) ఇంకా తేదీలను ప్రకటించలేదు.
బీజేపీ, జేడీ(యు), ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ మరోసారి బీహార్లో తమ అధికారాన్ని కొనసాగించాలని చూస్తుండగా.. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి నితీష్ కుమార్ను గద్దె దించాలని చూస్తోంది. ప్రశాంత్ కిషోర్ తన పార్టీ జన్ సూరాజ్ను రాష్ట్రంలో మరొక ప్రత్యామ్నాయంగా ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications